Begin typing your search above and press return to search.

ఇదంతా మెగా బ్రదర్ ప్లాన్ లో భాగంగానే జరిగిందా..?

By:  Tupaki Desk   |   1 July 2022 3:30 AM GMT
ఇదంతా మెగా బ్రదర్ ప్లాన్ లో భాగంగానే జరిగిందా..?
X
మెగా బ్రదర్ నాగబాబు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించారు. అయితే ప్రొడ్యూసర్ గా ఆయనకు నష్టాలే మిగిలాయి. ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా అంగీకరించారు. అయితే వెండితెరపై కంటే బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే ఆయన కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగిందని అందరూ అంటుంటారు.

నాగబాబు కొన్ని సీరియల్స్ లో ప్రధాన పాత్రలో నటించడమే కాదు.. ఈటీవీ లో 'జబర్దస్త్' కామెడీ షోకి జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నవ్వుల నాగబాబు - టవర్ స్టార్ వంటి పేర్లు ఈ ప్రోగ్రామ్ ద్వారానే వచ్చాయి. షోలో తనదైన శైలిలో నవ్వులు పూయించే నాగబాబు.. కొన్నేళ్లపాటు అదే కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్నారు.

అయితే షో నిర్మాతలతో విభేదాల కారణంగా నాగబాబు జబర్దస్త్ నుండి నిష్క్రమించారు. ఆ తరువాత షో డైరెక్టర్లు కూడా బయటకు వచ్చేసి కోసం నాగబాబుతో కలసి జీ తెలుగు ఛానల్ కోసం 'అదిరింది' అనే కామెడీ షో చేశారు. భారీగా ప్లాన్ చేసిన ఈ ప్రోగ్రామ్ వర్కవుట్ కాలేదు. దీంతో కొన్నాళ్లకే 'స్టార్ మా' కు షిఫ్ట్ అయ్యారు మెగా బ్రదర్.

అయితే, నాగబాబు 'మా' టీవీలోకి వచ్చిన తర్వాత, అన్నీ సానుకూలంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ‘కామెడీ స్టార్స్ ధమాకా’ అనే పేరుతో చేసిన షో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రారభించిన కొన్ని నెలల్లోనే మంచి టీఆర్పీ తెచ్చుకుంతోంది. దీనికి నాగబాబు - శేఖర్ మాస్టర్ లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ షోలో కనిపించే వారంతా ఒకప్పుడు 'జబర్దస్త్' 'ఎక్స్ ట్రా జబర్దస్త్' షోలో ఉన్నవారే కావడం గమనార్హం. దీని వెనుక నాగబాబు ప్లాన్ ఉందని.. ఆ షో నుంచి పాపులర్ కమెడియన్స్ బయటకు రావడం వెనుక మెగా బ్రదర్ ప్రధాన పాత్ర పోషించాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో 'జబర్దస్త్' మరియు 'ఎక్స్ట్రా జబర్దస్త్' నుంచి ఒక్కొక్కరుగా దూరం అవుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు మొదలుకొని.. సుడిగాలి సుధీర్ - గెటప్ శీను - కిర్రాక్ ఆర్పీ - రాకేష్ - అదిరే అభి - అప్పారావు వంటి వారు ఇప్పటికే జబర్దస్త్ ని వీడారు. సుడిగాలి సుధీర్ ఇప్పటికే 'స్టార్ మా' కోసం రెండు షోలను హోస్ట్ చేస్తున్నాడు.

ఇదే క్రమంలో ఎన్నో ఏళ్లుగా 'జబర్దస్త్' కు యాంకర్ గా చేసిన అనసూయ.. ఇప్పుడు ఆ షోకి గుడ్ బై చెప్పింది. స్టార్ మాలో సుధీర్ తో కలిసి ఒక షో హోస్ట్ చేయడానికి రెడీ అయింది. శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్ గా చేస్తున్న హైపర్ ఆది కూడా వీరి దారిలోనే నడవబోతున్నట్లు టాక్.

అయితే ఈటీవీ నుంచి వైదొలగేందుకు ఈ బుల్లితెర సెలబ్రిటీలకు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అది కూడా రెమ్యునరేషన్ భాగంగా కాకుండా అదనంగా చెల్లిస్తున్నారని.. దీని వెనుక మెగా బ్రదర్ ఉన్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. నాగబాబు అండ్ టీమ్ బయటకు వచ్చిన తర్వాత 'జబర్దస్త్' షో టీఆర్పీలు బాగా పడిపోయాయి. షో ని మళ్లీ ట్రాక్ లో పెట్టడానికి ఏం చేయాలా అని నిర్వాహకులు ఆలోచిస్తున్నారని సమాచారం.