Begin typing your search above and press return to search.

ఆమె కారణంగానే బాలయ్య విధానంలో మార్పు వచ్చిందా..?

By:  Tupaki Desk   |   24 May 2022 5:35 AM GMT
ఆమె కారణంగానే బాలయ్య విధానంలో మార్పు వచ్చిందా..?
X
కరోనా పాండమిక్ తర్వాత ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. 'ఎన్టీఆర్ కథానాయకుడు' 'ఎన్టీఆర్ మహనాయకుడు' 'రూలర్' వంటి హ్యాటిక్ ప్లాప్స్ తో డీలా పడ్డ నటసింహం.. గతేడాది చివర్లో వచ్చిన ''అఖండ'' చిత్రంతో అఖండమైన బాక్స్ ఆఫీస్ విజయాన్ని అందుకున్నారు.

అలానే ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం బాలయ్య చేసిన ''అన్ స్టాపబుల్'' అనే టాక్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిజిటల్ స్పేస్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీనియర్ హీరో.. తనదైన శైలిలో షోను నడిపించి అత్యధిక వ్యూయర్ షిప్ తో టాప్ లేపాడు.

అంతేకాదు ఈ కార్యక్రమం బాలకృష్ణ మీద నెగిటివిటీని చాలా వరకు తగ్గించడమే కాదు.. ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసింది. ఇలా కోవిడ్ మహమ్మారి తర్వాత నటసింహం అన్ స్టాపబుల్ గా ముందుకు సాగుతున్నారనే చెప్పాలి.

అయితే ఇప్పుడు బాలయ్య సక్సెస్ ఫుల్ గా రాణించడడం వెనుక ఆయన చిన్న కూతురు తేజస్విని ఉందని నందమూరి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. 'అన్‌ స్టాపబుల్' షోకు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించింది. తొలిసారిగా హోస్ట్ గా చేస్తున్న తన తండ్రికి అన్ని విషయాల్లో తొడుగా నిలిచిందని తెలుస్తోంది.

ఇందులో బాలయ్యను కొత్తగా చూపించేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారు. ఆహా టీమ్‌ తో కలిసి తన తండ్రి లుక్ మరియు కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే క్రమంలో బాలకృష్ణ క్రియేటివ్ నిర్ణయాలు తీసుకోవడంలో.. స్క్రిప్ట్ ఎంపికలో తేజస్విని కూడా పాలుపంచుకోవచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.

'అఖండ' వంటి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. గోపీచంద్ మలినేని మరియు అనిల్ రావిపూడి వంటి ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో అద్భుతమైన ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టారు బాలకృష్ణ. తేజస్విని కారణంగానే అతని విధానంలో మార్పు వచ్చిందని.. సరైన స్క్రిప్టులు ఎంచుకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏదైతేనేం బాలకృష్ణ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తుండటం.. NBK107 & NBK108 వంటి ఉత్తేజకరమైన లైనప్ ను చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఇకపోతే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇది వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ. దీని తర్వాత అనిల్ రావిపూడితో కలిసి ఓ వైవిధ్యమైన సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.