Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ సినిమా టికెట్ బుకింగ్ విధానంపై డైరెక్టర్ దేవకట్టా స్పందన..

By:  Tupaki Desk   |   9 Sep 2021 12:30 PM GMT
ఆన్ లైన్ సినిమా టికెట్ బుకింగ్ విధానంపై డైరెక్టర్ దేవకట్టా స్పందన..
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ సేవల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్ లతో సహా అన్ని థియేటర్లలో ఆ పోర్టల్ ద్వారానే సినిమా టిక్కెట్లు విక్రయించాల్సి ఉంటుంది. రైల్వే ఆన్ లైన్ టిక్కెటింగ్ సిస్టమ్ ఇష్యూ చేస్తున్న ఐ.ఆర్.సి.టి.సి. తరహాలో ఈ పోర్టల్ సేవలు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్రం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ సర్వీస్ నడుస్తుందని ఏపీ ప్రభుత్వం బుధవారం ఓ జీవో జారీ చేసింది.

బ్లాక్ మనీని నియంత్రించడం.. మధ్యవర్తుల వసూళ్లకు చెక్ పెట్టడానికే ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ సినిమా టికెట్ బుకింగ్ విధానం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్దేశం బాగానే ఉన్నప్పటికీ దీనిపై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో టిక్కెట్ ద్వారా వచ్చే ఆదాయమంతా ప్రభుత్వ ఖజానాకు పోతుందేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ప్రస్థానం' దర్శకుడు దేవ కట్టా ఆన్ లైన్ సినిమా టికెట్ బుకింగ్ విధానంపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

''రైల్వేస్ ప్రభుత్వ నిర్వహణలో ఉంటాయి కాబట్టి రైల్వే టికెట్స్ ను పప్రభుత్వం విక్రయిస్తుంది. ఒక ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెట్టిన ఒక ప్రొడక్ట్ మాదిరిగా.. మూవీలకు కూడా రెవెన్యూ రూటింగ్ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం నిధులు సమకూర్చబోతోందా? ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆన్లైన్ టికెటింగ్ సెటప్ అంటే సినిమా తీయడం అనేది ప్రభుత్వ ఒప్పందంలో పెట్టుబడి పెట్టడం లాంటిది.. అంటే తరువాత బిల్లులు క్లియర్ చేసుకోడానికి లైన్లో వేచి ఉండాలా? ప్రొడ్యూసర్ తన టిక్కెట్ అమ్మకాల నుండి తన పెట్టుబడిని తిరిగి పొందడం ఇలాగేనా? దయచేసి నా అవగాహన తప్పు అయితే నన్ను సరిచేయండి'' అని దేవా కట్ట ట్వీట్ చేశారు. దర్శకుడి అభిప్రాయంతో పలువురు ఏకీభవిస్తే మరికొందరు ఖండిస్తున్నారు.

వాస్తవానికి ప్రభుత్వ జీవో లో రైల్వే టికెటింగ్ సిస్టమ్ ని ప్రస్తావించడాన్ని బట్టి చూస్తే.. ఆన్ లైన్ ద్వారా సినిమా టిక్కెట్ అమ్మకాలను మాత్రమే ప్రభుత్వం తన కంట్రోల్ లోకి తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. థియేటర్ కౌంటర్ల దగ్గర విక్రయించే టిక్కెట్ సొమ్మును ప్రభుత్వం తీసుకోదనే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రైల్వే స్టేషన్స్ లో అమ్మే టిక్కెట్లకు.. ఆన్ లైన్ పోర్టల్ విక్రయాలకు సంబంధం ఉండదు. అయితే ఏపీ ప్రభుత్వం జీవో లో ఈ విషయాన్ని ప్రస్తావించి ఉంటే దీనిపై స్పష్టత వచ్చి ఉండేది. మరి త్వరలోనే దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చి దర్శకనిర్మాతలు, ఎగ్జిబిటర్స్ లో నెలకొన్న సందేహాలను క్లారిఫై చేస్తుందేమో చూడాలి.