Begin typing your search above and press return to search.

ప్రభాస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్..!

By:  Tupaki Desk   |   1 July 2022 11:30 AM GMT
ప్రభాస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ఇప్పుడు డార్లింగ్ చేతిలో ఉన్నన్ని భారీ ప్రాజెక్ట్స్ మరే ఇతర హీరో దగ్గర లేవని చెప్పొచ్చు. 'బాహుబలి' చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్.. దాన్ని కాపాడుకోడానికి కష్టపడుతున్నారు. ఈ క్రమంలో 'సాహో' 'రాధే శ్యామ్' వంటి సినిమాలు నిరాశ పరిచినా పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

ప్రభాస్ లైనప్ లో 'ఆది పురుష్' 'సలార్' 'ప్రాజెక్ట్ K' 'స్పిరిట్' వంటి సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ తో ఒకదానికి మించి మరొకటి అనేలా తెరకెక్కే చిత్రాలే కావడం గమనార్హం. అయితే వీటి మధ్యలో ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యారు ప్రభాస్.

ఇప్పటికే 'ఆది పురుష్' చిత్రీకరణ పుర్తవడంతో.. 'సలార్' మరియు 'ప్రాజెక్ట్ కె' గ్యాప్ లో మారుతి సినిమాకు పూర్తి చేయొచ్చని ప్రభాస్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రభాస్ - మారుతి కాంబో గురించి ఊహాగానాలు వచ్చినప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు తీస్తూ.. అదే స్థాయిలో మూవీ చేయకుండా ఇలాంటి ఎంటర్టైనర్ చేయడమేంటని మొన్నటి వరకూ కామెంట్స్ చేశారు.

అయితే ఇప్పుడు మెజారిటీ అభిమానులు ప్రభాస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మారుతి సినిమా అంటే త్వరగా షూటింగ్ ఫినిష్ చేసుకొని.. వెంటనే రిలీజ్ కు రెడీ అయిపోతుంది కాబట్టి.. తమ ఫేవరేట్ హీరోని త్వరగా బిగ్ స్క్రీన్ మీద చూసుకునే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.

ప్రభాస్ చేస్తున్న భారీ సినిమాలన్నీ కొన్ని నెలల తరబడి సెట్స్ మీదున్నాయి. అవి ఎప్పుడు థియేటర్లోకి వస్తాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో మారుతి అయితే వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని భావిస్తున్నారు.

గతంలో ఎస్ఎస్ రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు 'మగధీర' తర్వాత 'మర్యాద రామన్న' వంటి చిన్న సినిమా చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే విధంగా పెద్ద చిత్రాల మధ్యన మారుతి మూవీ చేయడం కరెక్టే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు ప్రభాస్ ని ఇప్పుడు యాక్టీవ్ రోల్స్ లో చూడాలని కోరుకుంటున్నారు. అప్పుడెప్పుడో 'బుజ్జిగాడు' 'డార్లింగ్' సినిమాల్లో అలాంటి పాత్రలు చేశారు. భారీ సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్స్ జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు దాసరి మారుతి అలాంటి క్యారెక్టరైజేషన్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. దీని కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఓ సీనియర్ నిర్మాత ప్రభాస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వందల కోట్లతో రూపొందే భారీ సినిమాల మధ్య అలాంటి ఎంటర్టైనర్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఎప్పుడు ఏ సినిమా చేయాలో.. తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలో ప్రభాస్ కు తెలియదా? అని కామెంట్స్ చేస్తున్నారు.

'మిర్చి' తో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత 'బాహుబలి' సినిమా కోసం రాజమౌళి కి ఐదేళ్ల విలువైన సమయాన్ని కేటాయించారు ప్రభాస్. ఆ టైంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే వచ్చాయి. అప్పుడు ఆ డెసీజన్ తీసుకోవడం వల్లనే ప్రభాస్ ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉన్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న పెద్ద సినిమాలన్నీ ఆలస్యంగానే వస్తున్నాయి. అందులోనూ 'సాహో' 'రాధే శ్యామ్' లాంటి సినిమాలు దెబ్బతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం మధ్యలో మారుతి ప్రాజెక్ట్ ని సెట్ చేశారని భావిస్తున్నారు. మొత్తం మీద పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మధ్యలో డార్లింగ్ ఓ ఎంటర్టైనర్ చేయడం వంద శాతం కరెక్ట్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.