Begin typing your search above and press return to search.

మెగా ఫోన్ ప‌డుతున్న టిల్లు అన్న‌

By:  Tupaki Desk   |   28 Jun 2022 1:30 PM GMT
మెగా ఫోన్ ప‌డుతున్న టిల్లు అన్న‌
X
యంగ్ హీరోలు కేవ‌లం తెర‌పై న‌టించ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మైపోవ‌డం లేదు. త‌మ‌ని తాము హీరోలుగా నిల‌బెట్టుకోవ‌డం కోసం క‌థ, మాట‌ల‌ ర‌చ‌యితులుగానూ, స్క్రీన్ ప్లే రైట‌ర్లు గానూ స‌రికొత్త అవ‌తారాలు ఎత్తేస్తున్నారు. అలా హీరోలుగా న‌టిస్తూనే ఇత‌ర విభాగాల్లోనూ త‌మ స‌త్తాచాటుకుంటూ సూప‌ర్ హిట్ ల‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌ని సొంతం చేసుకుంటున్నారు. ఈ జాబితాలో యంగ్ హీరోలు అడివి శేష్‌, సిద్ధూ జొన్న‌లగ‌డ్డ‌, కిర‌ణ్ అబ్బ‌వ‌రం త‌మ ప్ర‌తిభ‌ని చూపిస్తూ విజ‌యాలు సాధిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్లుగా కూడా మార‌డానికి ఈ యంగ్ టాలెంటెడ్ హీరోస్ వెనుకాడ‌టం లేదు. ఇటీవ‌ల డీజే టిల్లు మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన హీరో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. నేహా శెట్టి హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీకి విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అత‌నితో క‌లిసి ఈ మూవీకి హీరో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ క‌థ ర‌చ‌యిత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైన ఈ మూవీ చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యాన్ని సాధించింది.

బాక్సాఫీస్ లెక్క‌ల ప్ర‌కారం చెప్పాలంటే ఈ మూవీ ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అని చెప్పొచ్చు. త‌క్కువ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో 30 కోట్ల మేర వ‌సూళ్లని రాబ‌ట్టి హీరోతో పాటు మేక‌ర్స్ ని సైతం విస్మ‌యానికి గురిచేసింది. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం, శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌, రామ్ మిర్యాల సంగీతం, నేహా శెట్టి గ్లామ‌ర్‌, సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ మార్వ‌లెస్ పెర్ఫార్మెన్స్ వెర‌సి ఈ మూవీని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌బెట్టి హీరో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌కు ప్ర‌త్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

దీంతో హీరోగా త‌న‌కు క్రేజ్ ని తెచ్చిపెట్టిన 'డీజే టిల్లు'కు సీక్వెల్ ని చేయాల‌ని సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ మిగ‌తా సినిమాల‌ని ప‌క్క‌న పెట్టి సీక్వెల్ కు రెడీ అయిపోయాడు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య దేవ‌ర నాగ‌వంశీనే ఈ సీక్వెల్ ని కూడా నిర్మించ‌బోతున్నారు. ఇటీవ‌లే పూజా కార్య‌క్రమాలు జ‌రిగాయిని, త్వ‌ర‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంచైజీ తెర‌పైకి రాబోతోందంటూ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 'డీజే టిల్లు 2' గా రాబోతున్న ఈ మూవీకి హీరో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ నే ద‌ర్శ‌కత్వ బాధ్య‌త‌ల్ని కూడా తీసుకోబోతున్నాడ‌ట‌.

'డీజే టిల్లు'కు విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సీక్వెల్ ని కూడా అత‌నితోనే చేయాల‌ని భావించినా ప్ర‌స్తుతం విమ‌ల్ కృష్ణ మ‌రో ప్రాజెక్ట్ ని చేస్తుండ‌టంతో 'డీజే టిల్లు 2' ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌తల్ని సిద్ధూ జొన్న‌గ‌డ్డ‌నే తీసుకుంటున్నార‌ట‌. పారిస్ నేప‌థ్యంలో ఈ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు.

గుంటూర్ టాకీస్ నుంచి డీజే టిల్లు వ‌ర‌కు నాలుగు సినిమాల‌కు సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ రైట‌ర్‌గా, డైలాగ్ రైట‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు. అదే అనుభ‌వంతో 'డీజే టిల్లు 2'కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడ‌ట‌. దీనికి సంబందించిన అఫీషియ‌ల్ న్యూస్ త్వ‌ర‌లోనే రానున్న‌ట్టుగా తెలుస్తోంది.