Begin typing your search above and press return to search.

ఓటీటీలు ఉన్నాయనే ధైర్యమే వాళ్ళను ముందుకు నడిపిస్తోందా..?

By:  Tupaki Desk   |   27 Oct 2020 1:30 AM GMT
ఓటీటీలు ఉన్నాయనే ధైర్యమే వాళ్ళను ముందుకు నడిపిస్తోందా..?
X
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ పీరియడ్ లో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూతబడిపోయాయి.. దీంతో థియేటర్స్ లో సినిమాల విడుదల ఆగిపోయింది. అయితే లాక్‌ డౌన్ సడలింపులతో సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా మాములు స్థితికి వస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగుల సందడి తిరిగి ప్రారంభమైంది. అంతేకాక కేంద్ర ప్రభుత్వం సగం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతినిచ్చింది. ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దానిపై స్పష్టత లేనప్పటికీ త్వరలోనే తెరుస్తారనే విషయం అర్థం అవుతోంది. దీంతో ఇన్నాళ్లూ సైలెంటుగా ఉన్న మేకర్స్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు ఇచ్చేస్తున్నారు.

విజయదశమి సందర్భంగా టాలీవుడ్ లో చాలా సినిమాల అనౌన్సమెంట్స్.. సినిమా షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. తెలుగు నుంచి సుమారు పాతిక సినిమాల అనౌన్స్ మెంట్స్ జ‌రిగాయి. అందులో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో.. అసలు ఎన్ని సినిమాలు పట్టాలెక్కుతాయో తెలీదు కానీ.. లాక్ డౌన్ త‌రువాత సినిమా ఓపెనింగ్స్ ఈ రేంజ్ లో జ‌ర‌గడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు. క్రైసిస్ టైమ్ లో ఇలా భారీ స్థాయిలో సినిమాలు లాంఛ్ అవ్వ‌డం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే థియేటర్స్ దొరక్కపోయినా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఉంది కదా అనే భావం ఎక్కువ మంది ఫిల్మ్ మేక‌ర్స్ లో క‌నిపిస్తోంద‌ని.. అందుకే న్యూ ప్రాజెక్ట్స్ ఈ రేంజ్ లో అనౌన్స్ చేసారని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గ‌తంలో శాటిలైట్ రైట్స్ కోసం సినిమాలు తీసిన‌ట్టే ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఫిలిం మేకర్స్ సినిమాలు నిర్మిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.