Begin typing your search above and press return to search.

#టాలీవుడ్.. జ‌గ‌న్ తో స‌మావేశం జంత‌ర్ మంత‌ర్!

By:  Tupaki Desk   |   16 Sep 2021 12:30 AM GMT
#టాలీవుడ్.. జ‌గ‌న్ తో స‌మావేశం జంత‌ర్ మంత‌ర్!
X
04 సెప్టెంబ‌ర్ ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తో తెలుగు సినీప‌రిశ్ర‌మ పెద్ద‌ల స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. కానీ అది సాధ్య‌ప‌డ‌లేదు. ఆ త‌ర్వాత కూడ ప‌లుమార్లు ఇదిగో పులి అంటే అదిగో మేక అన్న చందంగా ప్ర‌చారం సాగింది. ఇప్ప‌టికీ అదే ప‌రిస్థితి. దేనిపైనా స‌రైన క్లారిటీ లేదు. ఈ 15 రోజుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ తో తెలుగు సినీ పరిశ్రమ పెద్దల మధ్య సమావేశం జరగాల్సి ఉన్నా కానీ ఇప్పటి వరకు దీనిపై స్పష్టత లేదు. ఈ విష‌యంలో చాలా పెద్ద డైల‌మా నెల‌కొంది. ఏపీ ప్రభుత్వ వర్గాల నుండి టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానం అన్న‌దే లేద‌ని గుస‌గుస వేడెక్కిస్తోంది.

మంత్రి నానీతో ప‌లు ద‌ఫాల చ‌ర్చ సాగింది. ఏపీ సీఎంవో పేచీ నుంచి అనుమ‌తులు ల‌భించాయి. సినీ పెద్దలకు సెప్టెంబర్ 20 న తాడేపల్లిలో సీఎం జగన్ తో భేటీకి రావాల్సిందిగా కోరార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. కానీ ఈ సమావేశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం లేదా సినీ ప‌రిశ్ర‌మ‌ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇప్ప‌టికే సినీపెద్ద‌లు ప‌లు ద‌ఫాలుగా ప‌రిశ్ర‌మ‌ సమస్యల గురించి చర్చించారు. ప్ర‌తి స‌మ‌స్య‌ను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతారు. ప్రధానంగా టికెట్ ధర ఒక పెద్ద స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. ఏపీ ప్రభుత్వం అధికారిక పోర్టల్ ద్వారా టికెట్ బుకింగ్ ను చేపట్టాలని యోచిస్తుండడంతో దీనిపై అభ్యంతరాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సీఎం జగన్ ముందు టాలీవుడ్ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. సెకండ్ గ్రేడ్ కేంద్రాలలోనూ సీటింగ్ సౌకర్యం ఆధారంగా టికెట్ ధరలను పెంచాలని అభ్యర్థిస్తున్నారు.

భేటీలో ఇంకా ఏం చ‌ర్చిస్తారు?

టాలీవుడ్ సినీపెద్ద‌లు.. ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీకి ఎంద‌రికి అవ‌కాశం ఉంది? అంటే.. కేవ‌లం ఏడుగురు సినీప్ర‌ముఖులు మాత్ర‌మే పాల్గొన‌నున్నార‌ని ఇదివ‌ర‌కూ క‌థ‌నాలొచ్చాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ డి.సురేష్ బాబు.. ఉన్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి- మండ‌లి అధ్య‌క్షుడు సి కళ్యాణ్- నిర్మాత డిస్ట్రిబ్యూట‌ర్ కం ఎగ్జిబిట‌ర్ దిల్ రాజు ఈ బృందంలో ఉంటారని తెలిసింది. ఈ ఐదుగురితో పాటు మ‌రో ఇద్ద‌రు ఎవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక‌పోతే వైయ‌స్ జ‌గ‌న్ కి అత్యంత స‌న్నిహితుడైన కింగ్ నాగార్జున కు ఛాన్సుంది. నాగ్ ఇప్పటికే బిగ్ బాస్ కొత్త‌ సీజ‌న్ తో బిజీ అయినా ఈ కీల‌క భేటీకి హాజ‌ర‌వుతారు.

స‌మావేశం లో ఏం చ‌ర్చిస్తారు?

ఆంధ్రప్ర‌దేశ్ లో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య ప్ర‌ధాన‌మైన‌ది.. దీనివ‌ల్ల‌నే చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కావ‌డం లేదు. ఇటీవ‌ల టికెట్ ధ‌ర‌ల‌పై ఏపీలో వ‌చ్చిన స‌వ‌ర‌ణ‌ జీవోతో చిక్కుల‌పై సీఎం భేటీలో చ‌ర్చించ‌నున్నార‌ని తెలిసింది. గ్రామ పంచాయితీ- న‌గ‌ర పంచాయితీ- కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్టు ధ‌ర‌ల‌పై నా చ‌ర్చిస్తారు. ద‌ర్శ‌క‌న‌టుడు నిర్మాత‌ ఆర్.నారాయ‌ణ మూర్తి ఇత‌ర చిన్న నిర్మాత‌ల‌ డిమాండ్ మేర‌కు ఐదో షోని చిన్న సినిమాకి కేటాయించాల్సిందిగా సీఎంని కోర‌నున్నారు. అలాగే మునుప‌టిలాగే ప్ర‌తియేటా నంది అవార్డులతో క‌ళాకారుల‌ను ప్రోత్సహించాల‌ని కోర‌తారు. వినోద‌పు ప‌న్ను మినహాయింపులు..ఏపీ టాలీవుడ్ నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే స్టూడియోలు నిర్మించడానికి అవసరమైన భూముల రాయితీలపైనా చ‌ర్చిస్తార‌ని తెలిసింది. విశాఖ‌లో ఫిలింస్టూడియోల నిర్మాణానికి స్థ‌లాల సేక‌రణ.. స్థ‌లాల సేక‌ర‌ణ‌ వ‌గైరా వ‌గైరా చ‌ర్చించేందుక ఆస్కారం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో థియేట‌ర్లు మూత ప‌డి ఉన్నాయి. ఆ స‌మ‌యంలో క‌రెంటు బిల్లుల మాఫీ అంశం ప్ర‌స్థావ‌న‌కు తెస్తార‌ట‌. ఎగ్జిబిష‌న్ రంగాన్ని కాపాడ‌టానికి త‌క్ష‌ణ సాయం సీఎంని కోర‌తార‌ని తెలిసింది. అత్యంత కీల‌కంగా సినిమా టిక్కెట్ ధరలను పెంచడం .. విడుదలైన మొదటి వారంలో సినిమాల కోసం అదనపు బెనిఫిట్ షోలను నడపడం వంటి అంశాల్ని టాలీవుడ్ ప్రతినిధి బృందం సీఎం దృష్టికి తీసుకెళుతుంది.