Begin typing your search above and press return to search.

#Chiru153 పనులు ప్రారంభించిన చిత్ర యూనిట్..!

By:  Tupaki Desk   |   23 July 2021 7:30 AM GMT
#Chiru153 పనులు ప్రారంభించిన చిత్ర యూనిట్..!
X
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'లూసిఫర్' చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ కంప్లీట్ యాక్టర్ మోహల్ లాల్ పోషించిన పవర్ ఫుల్ పాత్రలో చిరు కనిపించనున్నారు. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ మోహన్ రాజాకు ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం పడకపోయుంటే #Chiru153 చిత్రాన్ని ఈపాటికే మొదలు పెట్టేవారు. అయితే పరిస్థితులు ఇప్పుడు చక్కబడటంతో 'లూసిఫర్' తెలుగు రీమేక్ పనులు ప్రారంభించారు.

ఈ రోజు శుక్రవారం #Chiru153 కోసం ఓ భారీ సెట్ నిర్మాణానికి పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసం అద్భుతమైన టెంపుల్ టౌన్ సెట్ ఏర్పాటు చేసిన సురేష్‌ సెల్వరాజన్.. 'లూసిఫర్‌' రీమేక్‌ కోసం మాసివ్ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా సురేష్‌ సెల్వరాజన్ ట్వీట్ చేస్తూ.. ''క్రొత్తది ఏదైనా ఆనందాన్ని ఇస్తుంది. కొత్త రోజు, కొత్త ప్రారంభం. నా క్రొత్త చిత్రం కోసం సెట్ వర్క్ ప్రారంభిస్తున్నాను. మొదటి చిత్రం నుండి ప్రతి కొత్త చిత్రానికి నేను తీసుకువెళ్ళిన పాత జిట్టర్లతో, నేను మరొక అద్భుతాన్ని తీయగలనని నిర్ధారించుకున్నాను. #Chiru153'' అని పేర్కొన్నారు.

కాగా, కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఆర్.బి. చౌదరి - ఎన్.వి.ప్రసాద్ - పరాస్ జైన్ మరియు వాకాడ అప్పారావ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. చిరంజీవి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు మోహన్ రాజా స్క్రిప్ట్ లో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 'ఆచార్య' షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.