Begin typing your search above and press return to search.

సిల్క్ స్మిత దుమారం.. ముగ్గురితో చిరంజీవి!

By:  Tupaki Desk   |   14 Jun 2021 2:30 AM GMT
సిల్క్ స్మిత దుమారం.. ముగ్గురితో చిరంజీవి!
X
మెగాస్టార్ చిరంజీవి - రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం ‘కొండ‌వీటి రాజా’. ఈ సినిమాలో.. ‘వలయాల ఊయలలో..’ అనే ఐట‌మ్ సాంగ్ ఉంటుంది. అందులో ముగ్గురు భామ‌ల‌తో స్టెప్పేశారు చిరు. అప్ప‌టి వ‌ర‌కు ఒక ఐట‌మ్ సాంగ్ లో ఒక్క న‌టి ఉండ‌డ‌మే ట్రెండ్‌. ఇప్పుడు కూడా దాదాపుగా అంతే. ఒక‌వేళ ఇత‌రులు ఉన్నా.. వారంతా క‌లిసి చిందేస్తారు. కానీ.. ఒకే పాట‌లో ప‌ల్ల‌విలో ఒక‌రు, చ‌ర‌ణంలో మ‌రొక‌రు, ఇంకో చ‌ర‌ణంలో ఇంకొక‌రు క‌నిపించారు చిరంజీవి సినిమాలో. ఈ మార్పును ఎంతో కొత్త‌గా ఫీల‌య్యారు అప్ప‌టి జ‌నాలు. అయితే.. దాని వెనుక అస‌లు క‌థ వేరే ఉందట‌!

నిజానికి ఈ పాట‌లో సిల్క్ స్మితను మాత్ర‌మే బుక్ చేశారు. ఇందుకోసం రూ.25 వేల రెమ్యున‌రేష‌న్ ఇచ్చేశారు. ఆమె కాస్ట్యూమ్స్ కోసం మ‌రో రూ.20 వేలు కూడా ముందుగానే ఇచ్చేశార‌ట‌. అయితే.. సెట్స్ లో అడుగు పెట్టిన స్మిత.. స‌రిగా మేక‌ప్ చేసుకోలేద‌ట‌. దీంతో.. హెయిర్ స్టైల్ స‌రిగా లేదని, స‌రిచేసుకోవాల‌ని చెప్పార‌ట రాఘ‌వేంద్ర‌రావు. కానీ.. బాగానే ఉంద‌ని, ఇలాగే డ్యాన్స్ చేస్తాన‌ని చెప్పింద‌ట స్మిత‌. దానికి స‌రే నీ ఇష్టం అన్నార‌ట ద‌ర్శ‌కుడు.

ఆ త‌ర్వాత రెండో రోజు మ‌రింత మొండిగా వ్య‌వ‌హ‌రించింద‌ట‌. ఏదో విష‌య‌మై మాట్లాడ‌డానికి పిలిపిస్తే.. ద‌ర్శ‌కుడినే వ‌చ్చి త‌న‌తో మాట్లాడాల‌ని చెప్పి పంపింద‌ట‌. ఈ విష‌యం స్వ‌యంగా విన్నార‌ట నిర్మాత దేవీ వ‌ర‌ప్ర‌సాద్‌. దీంతో.. ఆయ‌న‌కు చాలా కోపం వ‌చ్చేసి, వెంట‌నే స్మిత‌ను సినిమా నుంచి తీసేయాల‌ని రాఘ‌వేంద్ర‌రావుకు చెప్పార‌ట‌. అలా.. ఆమెను ప‌క్క‌న పెట్టారు. అయితే.. అప్ప‌టికే ఆమెతో కొంత పాట‌ను షూట్ చేశారు. ప‌ల్ల‌వి, చ‌ర‌ణం మాత్రం మిగిలి ఉన్నాయి.

దీంతో.. ఏం చేయాలా? అని ఆలోచించి.. కొత్త‌గా ట్రై చేద్దామ‌ని ఫిక్స్ అయ్యారు. ఆ విధంగా ప‌ల్ల‌విని జ‌య‌మాలినితో, మ‌రో చ‌ర‌ణాన్ని అనురాధ‌తో షూట్ చేశారు. స్మిత‌తో షూట్ చేసిన భాగాన్ని అలాగే ఉంచారు. ఆ విధంగా.. ఒకే పాట‌లో ముగ్గురు న‌టీమ‌ణుల‌తో మెగాస్టార్ చిందేసిన‌ట్ట‌య్యింది. ఇది ఆడియ‌న్స్ కు బాగా న‌చ్చేసింది కూడా. కొన్నిసార్లు.. మ‌ర‌క మంచిదే అంటే ఇదేనేమో?!