Begin typing your search above and press return to search.

'తమ్ముడి' కోసం త్యాగం చేయడానికి సిద్ధమే అంటున్న 'అన్నయ్య'

By:  Tupaki Desk   |   5 April 2020 3:01 PM GMT
తమ్ముడి కోసం త్యాగం చేయడానికి సిద్ధమే అంటున్న అన్నయ్య
X
మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయం ఇచ్చిన ఊపుతో ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. మెగాస్టార్ కెరీర్ లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి కాగా కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన మెగాస్టార్ ఒక దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించాడట. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన మెగాస్టార్ మొక్క‌ల‌కు నీళ్లు పోయ‌డం.. వ్యాయామం చేయ‌డం.. ఇంట్లో కూర్చుని పాత సినిమాలు చూడ‌డం.. ఇవే చిరు దిన చ‌ర్య‌గా మారిందని చెప్పుకొచ్చాడట.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ మూవీ తెలుగు రీమేక్ హక్కులను రామ్ చరణ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ‘లూసిఫర్’ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించారు. ఆ పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్నారు. ఈ సినిమా మినహా మరే ప్రాజెక్ట్‌ ను అంగీకరించలేదని చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం నలుగురైదుగురు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ‘లూసిఫర్’ రీమేక్‌ కు ఇంకా దర్శకుడు ఎవరనేది కూడా నిర్ణయించుకోలేదని చిరంజీవి చెప్పారట. ఈ పొలిటికల్ నేపథ్యంలో ఉండే సినిమాలో నటించాలని పవన్ కళ్యాణ్ ఆశపడుతున్నట్లు వార్తలొచ్చాయని ప్రస్తావించగా ‘ఆ సినిమా నేనే చేస్తా. తమ్ముడు చేయాలని ఉత్సాహపడితే తప్పకుండా తనకు ఇచ్చేస్తా. తనకు చేయాలనుందనే విషయం అయితే నా వరకు రాలేదు’ అని చెప్పారట. అయితే ఇప్పటికే మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు పవన్. వకీల్ సాబ్‌తో పాటు క్రిష్ - హరీష్ శంకర్ సినిమాలు కూడా లైన్‌ లోనే ఉన్నాయి. మరి ఈ సినిమాని కూడా లైన్ లో పెడతాడో.. లేక అన్నయ్య చేస్తేనే బాగుంటుందని చిరూకే వదిలేస్తాడేమో చూడాలి.