Begin typing your search above and press return to search.

మంత్రి తలసానితో భేటీలో సినీ ప్రముఖులు ఏం చర్చించారంటే..?

By:  Tupaki Desk   |   3 Dec 2021 11:32 AM GMT
మంత్రి తలసానితో భేటీలో సినీ ప్రముఖులు ఏం చర్చించారంటే..?
X
తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో టాలీవుడ్ సినీ పెద్దలు ఈరోజు శుక్రవారం భేటీ అయ్యారు. ఇండస్ట్రీలోని పలు సమస్యలతోపాటు.. సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఈ సమావేశంలో చర్చించారని తెలుస్తోంది.

ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో థియేటర్లు మూసివేస్తారని జరుగుతున్న ప్రచారం గురించి మాట్లాడారని సమాచారం.

తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమైన వారిలో నిర్మాతలు దిల్ రాజు - డీవీవీ దానయ్య - అభిషేక్ నామా - దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి - త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో పాటుగా మరికొందరు సినీ ప్రముఖులు ఉన్నారు. సుమారు గంటపాటు సాగిన ఈ మీటింగ్ లో అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించారని తెలుస్తోంది.

కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ఆంక్షలు విధిస్తారని.. సీటింగ్ ఆక్యుపెన్సీ తగ్గిస్తారని గత రెండు రోజులు ప్రచారం జరుగుతోంది. అలానే తెలంగాణలోని సినిమా థియేటర్లలో కొత్త సినిమాల విడుదల సందర్భంగా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ బుధవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రితో సినీ ప్రముఖులు ఈ విషయాల గురించి చర్చించారని తెలుస్తోంది.

అయితే జనాలు థియేట‌ర్ల‌కు వెళ్ళి ధైర్యంగా సినిమా చూడొచ్చని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. థియేట‌ర్ల మూత‌ - ఆక్యుపెన్సీ త‌గ్గింపు వంటి ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని తెలిపారు.

సినిమా టికెట్‌ ధరలు తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఎక్కడో ఎవరో రేట్లు తగ్గించారని, వారిని చూసి తాము కూడా అలా తగ్గించేది లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మంత్రి స్ప‌ష్టం చేశారు. ''కరోనా వల్ల గత రెండేళ్లుగా చిత్ర పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ భయాలు మొదలయ్యాయి. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. థియేటర్‌ ఆక్యుపెన్సీపై ఎలాంటి ఆంక్షలు లేవు.

తెలంగాణ ప్రభుత్వం 100శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇచ్చినా.. గత కొన్ని రోజులుగా ఆ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్స్‌ కు రావటం లేదు. ‘అఖండ’ తో థియేటర్‌ కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య కాస్త పెరిగింది. త్వరలో భారీ బడ్జెట్‌ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

థియేటర్స్ కు వచ్చి సినిమా చూసేవారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో దర్శకనిర్మాతలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు దాదాపు పూర్తయ్యాయి. సినీ ఇండస్ట్రీపై అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వం వారికి ఎప్పుడూ అండగా ఉంటుంది'' అని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

కాగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంతకుముందు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు, బుల్లితెర రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తుందని.. టాలీవుడ్ ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కులాలు, మతాలు, ప్రాంతీయ భావనలకు చోటు లేదని మంత్రి అన్నారు.