Begin typing your search above and press return to search.

క‌రోనాతో అట్టుడుకుతుంటే సెల‌బ్రిటీలు జాలీ ట్రిప్

By:  Tupaki Desk   |   21 April 2021 9:30 AM GMT
క‌రోనాతో అట్టుడుకుతుంటే సెల‌బ్రిటీలు జాలీ ట్రిప్
X
సెకండ్ వేవ్ తీవ్ర‌త‌రం అవ్వ‌డంతో ముంబై-మ‌హారాష్ట్ర లాక్ డౌన్ లోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. నెలాఖ‌రు వ‌ర‌కూ ఉత్త‌రాది అంత‌టా ఇదే ప‌రిస్థితి. ఇత‌ర రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూలు విధిస్తున్నారు. ఒక‌టి రెండు నెల‌ల పాటు ఈ ఉధృతి ఇలానే కొన‌సాగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ త‌ర్వాత అయినా ప‌రిస్థితి అదుపులోకి రావాలంటే జ‌నాలు స్వ‌చ్ఛందంగా జాగ్ర‌త్త పాటించాలి.

అయితే ఇలాంటి స‌మ‌యాల్లో ఎవ‌రూ ఇంట్లోంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌దంటూ సెల‌బ్రిటీలంతా వీడియో సందేశాలు పంపుతున్నారు. అయితే కొంద‌రు నీతులు ఉన్న‌ది ఎదుటివారికి చెప్పేందుకే అనేలా ప్ర‌వ‌ర్తించ‌డంతో సెల‌బ్రిటీలంద‌రినీ తిట్టేస్తున్నారు నెటిజ‌నం. ఓవైపు క‌రోనా సెకండ్ వేవ్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తుంటే మాల్దీవుల విహార‌మా? విందులు వినోద యాత్ర‌లా? అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు.

ఘోరమైన కరోనావైరస్ కి వ్యతిరేకంగా మ‌నమంతా ఏడాది కాలంగా పోరాడుతున్నాం. ఇది జీవితాల్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తోంది. ప్ర‌జ‌ల‌కు క‌నీస బ‌తుకు లేకుండా చేస్తోంది. ఇలాంటి స‌న్నివేశంలో సెల‌బ్రిటీలు ఇలా విహార‌యాత్ర‌ల‌కు వెళ్ల‌డం స‌రైన‌దేనా? పైగా మాల్దీవుల నుంచి గోవా నుంచి విహార యాత్ర‌ల పేరుతో అస‌భ్య‌క‌ర‌మైన ఫోటోలు వీడియోల్ని షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చార‌మా? అంటూ తిట్టేస్తున్నారు జ‌నం. ఇది అస‌హ్య‌క‌ర‌మైన ప‌రిస్థితి అంటూ ఆవేద‌న వెల్ల‌గ‌క్కుతున్నారు కొంద‌రైతే.

ఇప్ప‌టికే ఒంట‌రి దీవుల్లో పర్యటనలకు బయలుదేరిన నటులను నెటిజనం ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం దిషా పటాని త‌న బోయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ తో క‌లిసి మాల్దీవుల పర్యటన నుండి ఫోటోల‌ను షేర్ చేశారు. మహమ్మారి సీజ‌న్ లో రెండోసారి ఈ జంట షికార్ చేశారు.

దీనిపై నెటిజ‌నులు అస‌హ్యం వ్య‌క్తం చేస్తూ కొన్ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేశారు. ``ధనవంతులకు డబ్బు సౌకర్యాలు ఉన్నాయి. అందుకే వారు విదేశీ పర్యటనలకు వెళుతూ ఫోటోలు వీడియోల్ని పోస్ట్ చేస్తున్నారు. దేశం ఇప్పటికే భయంకరమైన పరిస్థితిలో ఉంది. మీరు మీ విలాసవంతమైన సెలవుల నుంచి ఫోటోల‌ను వీడియోలను ప్రదర్శిస్తున్నారు. అంతేకాక మాస్క్ ను కూడా మీరు ధరించలేదు`` అంటూ ఒక నెటిజ‌న్ చీవాట్లు పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

ఇంత‌కుముందే టైగర్ ష్రాఫ్ తన సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ కి ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. కానీ అత‌డు నియ‌మాన్ని ఉల్లంఘించి గాళ్ ఫ్రెండ్ తో విదేశాల‌కు షికార్లు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ముంబై నుంచి త‌ప్పించుకోజూశాడ‌ని ఆరోపించారు. ఈ రోజు టైగర్ ష్రాఫ్ పై గౌరవాన్ని కోల్పోయాను అంటూ ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు.

టైగ‌ర్ - దిశా ప‌టానీ జంట‌తో పాటు రణబీర్ కపూర్ -ఆలియా భట్ జంట ఇలానే మాల్దీవుల్లో విహ‌రించారు. సారా అలీ ఖాన్ కుటుంబం కూడా ఈ వారం మాల్దీవులకు బయలుదేరారు. వారం క్రితం శ్రద్ధా కపూర్- జాన్వి కపూర్ కూడా మాల్దీవుల విహారంలో ఫుల్ గా చిలౌట్ చేశారు. అక్క‌డి నుంచి వ‌రుస‌గా బికినీ ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేశారు. ఇంత‌కుముందు కియ‌రా అద్వాణీ- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌హా ప‌లువురు సౌత్ స్టార్లు మాల్దీవుల్లో విహ‌రించిన సంగ‌తి తెలిసిందే. వీళ్లంద‌రికీ టోకున జ‌నం నుంచి కౌంట‌ర్లు ప‌డిపోతున్నాయి.