Begin typing your search above and press return to search.

మామా అల్లుళ్లు 'పవన్ - సాయి తేజ్' మధ్య బాండింగ్ అలాంటిది..!

By:  Tupaki Desk   |   11 Sep 2021 3:27 PM GMT
మామా అల్లుళ్లు పవన్ - సాయి తేజ్ మధ్య బాండింగ్ అలాంటిది..!
X
మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ మీద స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న తేజ్.. ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అయితే తేజ్ బైకు నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. హెల్మెట్ లేకపోతే తలకు బలమైన గాయాలు తగిలే ప్రమాదం ఉండేది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

నిజానికి సాయి తేజ్ ఎప్పుడు బైక్ డ్రైవింగ్ చేసినా హెల్మెట్ పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. బైక్ మీద వెళ్తే తప్పకుండా హెల్మెట్ ధరించాలని తన మామ పవన్ కళ్యాణ్ చెబుతారని తేజ్ పలు సందర్భాల్లో చెపుతూ ఉంటాడు. బహుశా మెగా మేనల్లుడికి బైక్స్ మీద ఇష్టం తన మేనమామ నుంచే వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కూడా బైక్స్ అంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు. రాజకీయాల్లోకి రాకముందు వరకు పవన్ లేటెస్ట్ బైక్స్ ని కొనుగోలు చేస్తూ ఉండేవారు. అలానే స్పోర్ట్స్ మీద ఎక్కువ ఆసక్తి కనబరిచే సాయి తేజ్ కూడా బైక్స్ అన్నా.. బైక్ రైడింగ్ అన్నా ఇష్టం చూపిస్తుంటారు. తన సంపాదనతో కొన్న ఫస్ట్ బైక్ ను మామ పవన్ కళ్యాణ్ కు చూపించినట్లు ఓ ఇంటర్వ్యూలో తేజ్ వెల్లడించారు.

''నా ఫస్ట్ లోకోమోటివ్ పవన్ కళ్యాణ్ గారి అవేంజర్ బైక్. చిన్నప్పటి నుంచి నాకు బైకులంటే ఇష్టం. దాని మీద కూర్చొని ఫొటోలు దిగడం.. వయస్సు వచ్చిన తర్వాత దాని మీద బయటకు వెళ్లడం.. పెట్రోల్ అయిపోతే నెట్టుకుంటూ రావడం.. అవన్నీ జరుగుతూ ఉండేవి. నేను హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్నప్పుడు దాన్ని కళ్యాణ్ గారికి చూపించాను. అప్పుడు ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్.. 'హెల్మెట్ ఉందా?' అని. 'ఉందడి.. ఫస్ట్ అదే కొన్నాను' అని చెప్పాను. బైక్ మీద వెళ్లేప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. బైకు మీద వేగంగా వెళ్లవద్దని కూడా చెబుతారు'' అని సాయి తేజ్ తెలిపాడు.

చిన్నప్పటి నుంచీ కూడా ఫ్యామిలీలో మిగతా వారి కంటే సాయి తేజ్ తోనే పవన్ కళ్యాణ్ ఎక్కువ అటాచ్ మెంట్ తో ఉండేవారని తెలుస్తోంది. తేజ్ కూడా మిగతా ఇద్దరు మామల మీద విధేయత అభిమానం చూపిస్తూ.. పవన్ తో కాస్త క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టడానికి మేనమామగా పవన్ తన వంతు సపోర్ట్ ఇచ్చాడనే సంగతి తెలిసిందే. కెరీర్ గురించే కాకుండా బయట ఎలా జాగ్రత్తగా బాధ్యతగా ఉండాలనే విషయాలను కూడా తేజ్ కు చెబుతూ వస్తుంటారు.

ఎలాంటి చెడు వ్యాసనాలు లేని సాయి తేజ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోడ్డు మీదున్న ఇసుక మట్టి కారణంగా దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో తాను ధరించిన హెల్మెట్ తేజ్ కు రక్షగా నిలిచింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మాదాపూర్ పోలీసులు సాయి తేజ్ ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్లి తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలో మిగతా మెగా ఫ్యామిలీ సభ్యులందరూ వచ్చి పోతున్నా.. పవన్ మాత్రం నిన్న రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఆసుపత్రి వద్దే ఉన్నారని సమాచారం. మామా అల్లుళ్లు పవన్ - సాయి తేజ్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో ఇలాంటివి చూసి అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని జూబ్లీహిల్స్ అపోలో డాక్టర్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. ''సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్సకు స్పందిస్తున్నారు. ఇంటర్నల్ గా ఎటువంటి గాయాలు లేవు.. బ్లీడింగ్ లేదు. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. కాలర్ బోన్ గాయానికి శస్త్ర చికిత్స గురించి 24 గంటల తర్వాత ఆలోచిస్తాం. ప్రస్తుతానికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం'' అని అపోలో వైద్యులు వెల్లడించారు.