Begin typing your search above and press return to search.

ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడిపై బ‌యోపిక్

By:  Tupaki Desk   |   24 Jan 2023 10:55 AM GMT
ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడిపై బ‌యోపిక్
X
మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల కుట్ర‌ల‌ను ఎదురించిన అరివీర‌ప‌రాక్ర‌మ‌వంతుడు గొప్ప చ‌క్ర‌వ‌ర్తిగా ఛ‌త్ర‌ప‌తి శివాజీ భార‌త‌దేశ చ‌రిత్ర‌లో నిలిచారు. చ‌క్ర‌వ‌ర్తి పెద్ద కుమారుడు శంభాజీ ధ‌ర్మాత్ముడిగా పేర్గాంచారు. ఇప్పుడు శివాజీ కుమారుడు శంభాజీ రాజే భోంస్లే (మరాఠీ) బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంది. టైటిల్ పాత్ర‌లో ఊరి ఫేం విక్కీ కౌశ‌ల్ న‌టించ‌నున్నాడు. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి.

ఇక ఈ హిస్టారిక‌ల్ క‌థ‌ను ప‌రిశీలిస్తే..ఎంతో ఇంట్రెస్టింగ్ గా విష‌యాలు వెలుగు చూశాయి. శంభాజీ 14 మే 1657 -11 మార్చి 1689 మ‌ధ్య జీవించారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు. శివాజీ తర్వాత ఆయన వారసునిగా మరాఠా సామ్రాజ్యాన్ని పాలించాడు.

అయితే మొఘ‌లుల దురాక్ర‌మ‌ణ‌లో అత‌డిపై అతి పెద్ద కుట్ర జ‌రిగింది. శంభాజీ అతని సలహాదారు కవికలష్ లను ఔరంగజేబు సేనాని ముకర్రబ్ ఖాన్‌ సంగమేశ్వర్‌ వద్ద కుట్రచేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్లతో కొట్టి పేడ ముఖంపైకి విసిరి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నిటినీ తనకు స్వాధీనం చేసి ఇస్లాంలోకి మారితే శంభాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు వెుఘల్‌ చక్రవర్తి. తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ని కీర్తించాడు శంభాజీ. దాంతో వారిని నలభై రోజులపాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు- గోళ్లూ పీకారు. బతికుండగానే చర్మం వలిచారు. ఏం చేసినా మతం మారననీ ఒక్క కోటనూ స్వాధీనం చేయననీ ధైర్యంగా చెప్పాడు శంభాజీ. చివరకు 11మార్చి 1689న ఈ వీరాధివీరుడు అసువులు బాశాడు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. శంభాజీ శవాన్ని ముక్కలు ముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు. అక్కడికి దగ్గరలోని వధు గ్రామస్థులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెదికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమసంస్కారాలు జరిపించారు.

తండ్రికి ఛత్రపతి బిరుదును అంకితం చేసిన‌ట్టే శంభాజీని ధర్మవీర్ గా ప్ర‌జ‌లు గౌరవిస్తారు. ఇలాంటి అద్భుత‌మైన ఎమోష‌న‌ల్ హిస్టారిక‌ల్ స్టోరీని ఎంపిక చేసుకోవ‌డంలోనే గొప్ప అభిరుచి ఉంది. ఈ విష‌యంలో ద‌ర్శక హీరోల‌ను మెచ్చి తీరాలి.. అయితే ఈ మూవీని ఎమోష‌న్ ని ర‌గిలించేలా తెర‌కెక్కించ‌డంలో ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ఏమేర‌కు స‌ఫ‌ల‌మవుతారో చూడాలి. విక్కీ కౌశ‌ల్ లాంటి ఫైనెస్ట్ ఆర్టిస్టుతో ఈ సినిమాని తెర‌కెక్కిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ వైవిధ్య‌మైన బ‌యోపిక్ ల‌తో అల‌రిస్తున్నాడు. చాలా కాలంగా హిస్టారికల్ సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నాడు. అత‌డు గతంలో తఖ్త్ .. ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ చిత్రాల‌కు సంతకం చేసాడు కానీ ఈ ప్రాజెక్టులు ఎందుక‌నో సెట్స్ పైకి వెళ్ల‌లేదు. తాజాగా విక్కీ సంతకం చేసిన మూడవ చారిత్రాత్మక చిత్రం. ప్ర‌స్తుతంరొమాంటిక్ కామెడీ చేస్తున్న లక్ష్మణ్ ఉటేకర్ తో ఈ సినిమాకి విక్కీ ప‌ని చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో నటుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ పోషిస్తారు. శంభాజీ మ‌హ‌రాజ్ ను శంభాజీ భోసలే.. శంభాజీ రాజే అని కూడా పిలుస్తారు. మరాఠా సామ్రాజ్యం రెండవ ఛత్రపతిగా.. ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడిగా అత‌డు ధ‌ర్మాన్ని కాపాడిన వీరుడు. అతను 1681 నుండి 1689 వరకు మ‌హారాష్ట్ర‌ను ఎనిమిదేళ్ల పాటు పరిపాలించాడు.

ఈ ప్రాజెక్ట్ ని దినేష్ విజన్ మాడాక్ ఫిల్మ్స్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించబడుతుంది. గతంలో లుకా చుప్పి - మిమీ వంటి మ‌ధ్య‌స్థ బ‌డ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ ఉటేకర్ చాలా కాలంగా శంభాజీ రాజే (సాంభాజీని లాంఛనంగా పిలుస్తారు)పై సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ప్రతిష్టాత్మకమైనది.. అభిరుచి గల ప్రాజెక్ట్. శంభాజీ పాత్ర‌కు విక్కీ ప్రాణం పోసేందుకు సిద్ధంగా ఉన్నాడు. దానిని వీలైనంత గ్రాండ్ గా చేయడానికి ఏ ఒక్క అకాశాన్ని ఆ ఇద్ద‌రూ విడిచిపెట్ట‌ర‌ని తెలిసింది.

ల‌క్ష్మ‌ణ్ గత ఆరు నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాడు. అత్యున్నత స్థాయి సృజనాత్మక సాంకేతిక ప్రతిభావంతుల బృందాన్ని ప‌నిలోకి తీసుకువచ్చాడు. రచన పూర్తయింది. లక్ష్మణ్ అతని బృందం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నారు. దినేష్ విజన్ తన పూర్తి సహాయాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఒక అద్భుత‌మైన విజువ‌ల్ వండ‌ర్ గా మ‌ల‌చ‌డానికి భారీ బడ్జెట్ ను మంజూరు చేసాడని తెలిసింది.

ఈ ప్రాజెక్ట్ తో విక్కీ కౌశల్ కి ఇది ఆరవ నిజ జీవిత పాత్ర‌. విక్కీ ఇంతకుముందు రాజీ- సంజు- ఉరి: ది సర్జికల్ స్ట్రైక్- సర్దార్ ఉద్దం లో నిజ‌జీవిత పాత్ర‌ల‌ను పోషించాడు. త‌దుప‌రి ప్రాజెక్ట్ సామ్ బ‌హదూర్ లోను నిజ జీవిత పాత్రను పోషిస్తున్నాడు. నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన పాత్రలకు అత‌డు జీవం పోస్తున్నాడు. ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అందువ‌ల్ల శంభాజీ బ‌యోపిక్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

విక్కీ కౌశల్ తదుపరి మేఘనా గుల్జార్ `సామ్ బ‌హుదూర్‌`లోను నటిస్తున్నాడు. సారా అలీ ఖాన్ తో కలిసి లక్ష్మణ్ ఉటేకర్ తో రొమాంటిక్ కామెడీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. మానుషి చిల్లర్ తో YRF చిత్రం చేయ‌నున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.