Begin typing your search above and press return to search.

'క్వారంటైన్'లోకి తెలుగు హీరోయిన్..

By:  Tupaki Desk   |   1 Jun 2020 9:10 AM GMT
క్వారంటైన్లోకి తెలుగు హీరోయిన్..
X
ఈ మధ్య సామాన్య జనాలతో పాటు సినీ తారలు కూడా క్వారంటైన్ లోకి వెళ్లక తప్పట్లేదు. తెలుగు ఇండస్ట్రీలోకి ఆవకాయ బిర్యాని సినిమాతో అరంగేట్రం చేసిన తెలుగమ్మాయి బిందుమాధవి. చక్కనైన కట్టు బొట్టుతో మొదటి సినిమాలో మెప్పించినప్పటికీ పెద్దగా అవకాశాలు అందుకోలేక పోయింది. తెలుగులో అడపాదడపా కన్పించింది బిందు కానీ తన కెరీర్ లో ఇంతవరకు సరైన బ్రేక్ దొరకలేదు. ఆ తర్వాత ఈ తెలుగు బ్యూటీ తమిళ సినిమాల అవకాశాలతో బిజీ అయిపోయింది. చాలాకాలం తర్వాత సోషల్ మీడియాలో కనిపించి తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. తెలుగులో బంపర్ ఆఫర్, ఓం శాంతి, రామ రామ కృష్ణ కృష్ణలాంటి సినిమాల్లో అటు గ్లామర్ తోను ఇటు నటనతోను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బిందు తెలుగులో కనిపించిన చివరి సినిమా పిల్లా జమిందార్. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన బిందు మాధవి ఇకనైనా కెరీర్ ని చక్కదిద్దుకుందాం.. అనే ఆలోచనలో ఉందట. ఇక సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. తెలుగులో ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని చెప్పింది. ఇక ప్రస్తుతం తను అధికారుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపింది. ఎందుకంటే తను ఉంటున్న అపార్ట్మెంట్ లో ఒకరికి ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తిని ఐసోలేషన్ కి తరలించారట. ఇక ఎందుకైనా మంచిదని అపార్ట్మెంట్ లో ఉంటున్న అందరిని 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారట. దీంతో ప్రస్తుతం తాను క్వారంటైన్ లో ఉన్నట్లు బిందు మాధవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. చివరగా తమిళంలో పక్కా, కజగు 2 సినిమాలలో కనిపించిన అమ్మడు ప్రస్తుతం మరో రెండు తమిళ సినిమాలతో బిజీగా గడుపుతుందట.