Begin typing your search above and press return to search.

మహేశ్ ట్వీట్ పై బిల్ గేట్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   1 July 2022 4:53 AM GMT
మహేశ్ ట్వీట్ పై బిల్ గేట్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ దంపతులు ఇటీవల టెక్ దిగ్గజం, మెక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను కలిసిన సంగతి తెలిసిందే. హాలీడే ట్రిప్ కోసం మహేష్ తన ఫ్యామిలీతో న్యూయార్క్ వెళ్లగా.. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బిల్ గేట్స్ ను కలిసి కాసేపు ముచ్చటించారు.

బిల్ గేట్స్ తో కలసి దిగిన ఫోటోని మహేష్ బాబు - నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మిస్టర్ బిల్ గేట్స్ ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికులలో ఆయన ఒకరు.. మోస్ట్ హంబుల్ గా ఉండే వ్యక్తి! నిజంగా ఆయన ఒక స్ఫూర్తి!!" అని మహేశ్ పేర్కొన్నారు.

అయితే మహేశ్ ట్వీట్ పై తాజాగా బిల్ గేట్స్ స్పందించారు. మహేష్ బాబు మరియు నమ్రతలను కలవడం ఎంతో బాగుందని ట్వీట్ చేశారు. "న్యూయార్క్‌ లో ఉండటం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుంది - మీరు ఎవరిని ఎదుర్కొంటారో మీకు ఎప్పటికీ తెలియదు. మిమ్మల్ని మరియు నమ్రతను కలవడం చాలా బాగుంది!" అని బిల్ పేర్కొన్నారు.

బిల్ గేట్స్ తో మహేశ్ బాబు ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనికి లక్షల కొలదీ లైక్స్ వస్తున్నాయి. ఇప్పుడు సూపర్ స్టార్ ట్వీట్ పై టెక్ దిగ్గజం స్పందించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'సర్కారు వారి పాట' సినిమాతో హిట్ కొట్టిన మహేశ్ బాబు.. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫారిన్ టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ తదుపరి సినిమా ఇప్పటికే ఖరారు అయిన సంగతి తెలిసిందే. #SSMB28 వర్కింగ్ టైటిల్ తో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 'అతడు' 'ఖలేజా' తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతున్న చిత్రం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

హారిక అండ్ హాసిని బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో మహేశ్ బాబు సరసన పూజాహెగ్దే హీరోయిన్ గా కనిపించనుంది. 'మహర్షి' తర్వాత మరోసారి ఈ జోడీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు.

ఇదే క్రమంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు మహేశ్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ను దర్శక హీరోలు ధ్రువీకరించారు. దీని కోసం ప్రస్తుతం స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నారు జక్కన్న. ఇది కచ్చితంగా పాన్ ఇండియా మూవీ అవుతుందని సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు.