Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించిన బీహార్ ప్రభుత్వం...!

By:  Tupaki Desk   |   4 Aug 2020 9:10 AM GMT
బ్రేకింగ్ : సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించిన బీహార్ ప్రభుత్వం...!
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత జూన్ 14న మరణించిన సుశాంత్‌ మృతిపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుశాంత్ డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని మొదట అందరూ భావించినా రోజులు గడుస్తున్న కొద్దీ సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులపైన.. ఇండస్ట్రీ మాఫియాపైనా.. నెపోటిజం పైనా కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేసారు. అంతేకాకుండా సుశాంత్ ది సూసైడ్ కాదని హత్య అని.. కేసును సీబీఐ దర్యాప్తుకి అప్పగించాలని డిమాండ్ చేసారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ డిమాండ్ కి మద్ధతు తెలిపారు. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ సూసైడ్ కేసుని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.

కాగా సుశాంత్ సూసైడ్ కేసు అతని తండ్రి కంప్లైంట్ తో అనూహ్య మలుపు తిరిగింది. పాట్నాలో కేకే సింగ్ ఫిర్యాదు చేస్తూ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు పలువురి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసారు. దీంతో రంగంలోకి దిగిన బీహార్ పోలీసులు ఈ కేసు మూలాల్లోకి వెళ్లే కొద్ది కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి నుంచి రియా చక్రవర్తి తన ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక ఈ కేసుని దర్యాప్తు చేస్తూ వస్తున్న ముంబై పోలీసులు.. బీహార్ పోలీసులకు సహకరించకపోవడంపై అనేక విమర్శలు వచ్చాయి. ముంబై పోలీసులు తమ దర్యాప్తునకు సహకరించట్లేదంటూ పాట్నా పోలీసులు ఇప్పటికే ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ఈ క్రమంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ ను కలిసి తన కుమారుడి కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు.

ఈ నేపథ్యంలో హై ప్రొఫైల్ సూసైడ్ కేసు కావడం మరియు రెండు రాష్ట్రాల మధ్య పోలీసుల దర్యాప్తులో కీలక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో జాప్యం చోటు చేసుకోవడం.. ఈ కేసులో మరిన్ని విషయాలపై కూపీ లాగడానికి బీహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జనతాదళ్ (యునైటెడ్) అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. హై ప్రొఫైల్ సూసైడ్ కేసుగా గుర్తింపు పొందిన ఈ కేసును ఛేదించడానికి ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేశారని తెలిపారు. దీంతో సూసైడ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. దీనిపై బీజీపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ సుశాంత్ సూసైడ్ కేసుని సీబీఐ ఎంక్వైరీకి అప్పగించి మాట నిలబెట్టుకున్నందుకు మీకు అభినందనలు అని ట్వీట్ చేసారు. సోషల్ మీడియా వేదికగా ఇన్ని రోజులు ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన వారందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.