Begin typing your search above and press return to search.

సుశాంత్‌ : ఆ ఘటనపై సీఎం సీరియస్‌

By:  Tupaki Desk   |   3 Aug 2020 11:30 PM GMT
సుశాంత్‌ : ఆ ఘటనపై సీఎం సీరియస్‌
X
సుశాంత్‌ మృతి కేసు రెండు రాష్ట్రాల మద్య వివాదంగా మారింది. ఇప్పటికే ముంబయి పోలీసులు సుశాంత్‌ మృతికి సంబంధించిన కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు. ఎంక్వౌరీ కూడా ముగింపుకు వచ్చింది. ఈ సమయంలో బీహార్‌ పోలీసుల రంగ ప్రవేశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రే అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసును ముంబయి పోలీసులు చాలా లోతుగా ఎంక్వౌరీ చేస్తున్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా ఎవరి వద్ద అయినా ఈ కేసుకు సంబంధించి సమాచారం ఉంటే దర్యాప్తు బృందంకు లేదా హోం శాఖకు ఇవ్వొచ్చు అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. అయినా కూడా బీహార్‌ పోలీసులు ముంబయి చేరుకుని దర్యాప్తు చేయాలనుకున్నారు.

ముంబయి చేరుకున్న బీహార్‌ పోలీసు శాఖ వారిని క్వారెంటైన్‌ పేరుతో నిర్బంధించడంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే తమ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ తివారీని క్వారెంటైన్‌ పేరుతో నిర్బంధించారు అంటూ ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేయడంపై సీఎం స్పందించారు. బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ సీరియస్‌ అయ్యారు. ఇది రాజకీయ విషయం కాదు. న్యాయ సంబంధిత వ్యవహారం. వారి డ్యూటీని వారు చేసుకోనిస్తే బాగుంటుందని ముంబయి పోలీసులకు సీఎం నితీష్‌ సూచించారు.

సుశాంత్‌ కేసులో ఎవరినో కాపాడేందుకు ముంబయి పోలీసులు అనేక తప్పులు చేస్తున్నారని కేసును తప్పుదోవ పట్టించేందుకు లేదా నీరు గార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో ఐపీఎస్‌ వినయ్‌ తివారీ బలవంతపు క్వారెంటైన్‌ కూడా అదే తీరులో ఉందని అంటున్నారు. ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు ఆ అనుమానాలకు మరింతగా బలం చేకూర్చుతున్నాయి.