Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' మెలోడీ: అందరూ ఇష్టంగా వినేలా 'అంత ఇష్టం' పాట..!

By:  Tupaki Desk   |   15 Oct 2021 7:11 AM GMT
భీమ్లా నాయక్ మెలోడీ: అందరూ ఇష్టంగా వినేలా అంత ఇష్టం పాట..!
X
ప‌వ‌న్ క‌ల్యాణ్‌ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ''భీమ్లా నాయ‌క్''. మలయాళం సూపర్ హిట్‌ ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ఇందులో పవన్ భార్యగా నిత్యా మీనన్.. రానా కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుద‌లైన ఫస్ట్‌ లుక్ - ఇద్దరు హీరోల గ్లిమ్స్ - టైటిల్ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నేడు శుక్రవారం దసరా పండగ సందర్భంగా 'అంత ఇష్టం' అనే రెండో పాటను రిలీజ్ చేశారు.

గురువారం చిత్రం బృందం వదిలిన సాంగ్‌ ప్రోమో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా వచ్చిన ఫుల్ సాంగ్ వీక్షకులను అలరిస్తోంది. 'పేరెట్టి నిన్నెట్ట పిలిచేది తలిచేది.. నా ఇంటి పెనివిటివే.. బొట్టేట్టి ముద్దెట్టి నను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే.. నా బంగారి మావా.. నా బలశాలి మావా.. నా మెళ్లోని నల్ల పూసల్లో మణిపూసవే.. 'అంత ఇష్టం ఏందయా.. అంత ఇష్టం ఏందయ్యా నీకు నా మీద..' అంటూ సాగిన ఈ పాట పవన్ - నిత్యా మీనన్ ల మీద షూట్ చేయబడింది.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన తన భర్త భీమ్లా నాయక్ లోని ప్రేమ కోణాన్ని ఆయన భార్య ఈ పాట ద్వారా ఆవిష్కరించారు. ఇందులో పవన్ - నిత్యా జోడీ బాగుంది. వారికి ఒక బాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మెలోడీ గీతానికి ఎస్ ఎస్ థమన్ బాణీలు సమకూర్చారు. గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ప్రముఖ గాయని చిత్ర ఆలపించారు. 'అంత ఇష్టం' పాటను సినీ ప్రియులు ఇష్టంగా వింటున్నారు. అందుకే విడుదలైన కొన్ని గంటల్లోనే మంచి వ్యూస్ రాబట్టింది.

'భీమ్లా నాయక్' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తున్నారు. రవి కె చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.