Begin typing your search above and press return to search.

దసరా కానుకగా నందమూరి బాలకృష్ణ 'నర్తనశాల' విడుదల...!

By:  Tupaki Desk   |   19 Oct 2020 1:34 PM GMT
దసరా కానుకగా నందమూరి బాలకృష్ణ నర్తనశాల విడుదల...!
X
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన అద్భుతమైన చిత్రాలలో 'నర్తనశాల' ఒకటి. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ తన స్వీయదర్శకత్వంలో ఈ అపురూప చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబు లతో 2004లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న 'నర్తనశాల' ను తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ తారాగణంతో రూపొందిస్తున్నారని తెలియయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న తర్వాత హీరోయిన్ సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ కలల ప్రాజెక్ట్‌ 'నర్తనశాల' అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత బాలయ్య ఈ సినిమా పూర్తి చేసే ఆలోచన చేయలేదు. అయితే దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ దసరా సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

నందమూరి బాలకృష్ణ 'నర్తనశాల' చిత్రం ఎన్‌బికె థియేటర్‌ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి బాలకృష్ణ సంకల్పించారు. ఎట్టకేలకు బాలకృష్ణ దర్శకత్వం వహించిన 'నర్తనశాల' లోని సన్నివేశాలను చూడాలన్న అభిమానుల కోరిక ఈ నెల 24న నెరవేరనుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ తన ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ లో పోస్ట్ పెడుతూ.. ''నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి 'నర్తనశాల'. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ 'నర్తనశాల' చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. అర్జునుడిగా నేను.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం ఛారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళ నుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది'' అని తెలిపాడు.