Begin typing your search above and press return to search.

బాహుబలి రైటర్ ఉపాధ్యాయుడి బయోపిక్‌

By:  Tupaki Desk   |   3 Aug 2021 11:30 AM GMT
బాహుబలి రైటర్ ఉపాధ్యాయుడి బయోపిక్‌
X
టాలీవుడ్ దర్శక ధీరుడు, మాహిష్మతి రాజ్య సృష్టి కర్త రాజమౌళి గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతలా ఆయన తన సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచి అపజయం అన్నదే లేకుండా ముందుకు దూసుకుపోతున్నారు. ఇలా రాజమౌళి దిగ్విజయంగా తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారంటే దానికి స్టోరీ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక కారణం అని ఒప్పుకుని తీరాలి. అంతలా తన కథలతో విజయేంద్ర ప్రసాద్ మెస్మరైజ్ చేస్తుంటాడు. అందువల్లే భాష తో సంబంధం లేకుండా ఇండస్ర్టీ తో సంబంధం లేకుండా రాజమౌళి సినిమాలు హిట్లుగా నిలుస్తాయి.

పాన్ ఇండియా హీరోల గురించి చూసి ఉంటాం... కానీ విజయేంద్ర ప్రసాద్ పాన్ ఇండియా రైటర్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు లోనే కాకుండా అనేక భాషల సినిమాలకు కూడా ఆయన తన కలం మాయాజాలంతో హిట్ చేస్తుంటాడు. అందువల్ ఇండియా లో చాలా సక్సెస్ ఫుల్ స్టోరీ రైటర్ గా చలామణి అవుతున్నాడు. ప్రస్తుతం ఈ కథా రచయిత చేతిలో మూడు , నాలుగు భారీ ప్రాజెక్టులున్నాయి. ఆర్‌ ఆర్‌ ఆర్‌ మూవీ తరువాత రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయబోయే సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాదే కథ అందిచనున్నారు. అంతే కాకుండా ఆయన రామాయణం లో సీత ఇతివృత్తం తో ఓ కథను కూడా సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు.

ఇవి మాత్రమే కాకుండా విజయేంద్ర ప్రసాద్ ఒక వెరైటీ బయోపిక్ కథను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఉపాధ్యాయుడు రంజిత్ సింగ్ దిశాలేది అని సమాచారం. ఇంతకీ రంజిత్ సింగ్ దిశాలేలో అంతలా గొప్పతనం ఏముందని చాలా మందికి అనుమానం రావచ్చు. కానీ తాను చేసిన సమాజ సేవ గురించి తెలిస్తే ఎవరూ అలా అనరు. అంతలా తన సమాజ సేవతో ఆయన అభిమానం సంపాదించుకున్నాడు. విద్యా బోధనలో వినూత్న మార్పులు తీసుకురావడంతో పాటు పాఠశాల విద్యకు దూరమవుతున్న అనేక పేద విద్యార్థులు చదువుకునేలా చేసిన గొప్ప టీచర్ ఆయన. అంతే కాకుండా ఆయన ఒక పాఠశాలను నిర్మించేలా చేసి స్థానిక భాషల్లో పుస్తకాలు కూడా ముద్రింపజేశారు. అందువల్ల అనేక మంది పిల్లలకు చదువుకోవడం చాలా సులభమయింది.

ఆయన ప్రపంచ వ్యాప్తంగా 124 దేశాల టీచర్లు పోటీ పడ్డ గ్లోబల్ టీచర్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 12 వేల మంది పోటీ పడ్డ షార్ట్ ఫిలిం కంటెస్ట్ లో కూడా రంజిత్‌ సింగ్ కు అవార్డు రావడం విశేషం. కాగా ఇలా రంజిత్ జీవితంలోని ముఖ్య విషయాలతో బయోపిక్ ను తీసేందుకు కథను సిద్ధం చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. కానీ ఈ మూవీలో హీరోగా ఎవరు చేస్తారు? దర్శకత్వం ఎవరు వహిస్తారనే విషయం మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం.