Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: పాన్ ఇండియా స్టార్ల‌కు బ్యాడ్ డేస్

By:  Tupaki Desk   |   18 Jun 2021 3:30 PM GMT
టాప్ స్టోరి: పాన్ ఇండియా స్టార్ల‌కు బ్యాడ్ డేస్
X
తెలుగు సినిమా కొత్త ట‌ర్న్ తీసుకున్న ఈ స‌మ‌యంలో.. పాన్ ఇండియా రేంజుకు ఎదిగిన ఈ టైమ్ లో క‌రోనా మ‌హ‌మ్మారీ రంగ ప్ర‌వేశం అతి పెద్ద పంచ్ అనే విశ్లేషించాలి. బాహుబ‌లి ఫ్రాంఛైజీ ఘ‌న‌విజ‌యం అనంత‌రం తెలుగు సినిమా మార్కెట్ రేంజు అమాంతం పెరిగింది. ఇరుగుపొరుగునా మ‌న బ్రాండ్ విలువ ప‌దింత‌లైంది. ఓవ‌ర్సీస్ లోనూ హిందీ సినిమాకి ధీటుగా తెలుగు సినిమా ఎదిగింది.

అయితే ఇలాంటి స‌మ‌యంలో ఊహించ‌ని పిడుగులా మీద ప‌డింది క‌రోనా. ఈ వినాశ‌క‌ర మ‌హ‌మ్మారీ టాలీవుడ్ కి తెచ్చిన ముప్పు అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా ఎదుగుద‌ల‌ను ఒక్క‌సారిగా ఆపేసింది. వంద‌ల వేల‌కోట్ల బిజినెస్ కి పెను విఘాతంగా మారింది. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను మంది టాప్ హీరోలు పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్లుగా ఎద‌గాల‌ని క‌సిగా ఉన్నారు. కానీ ఎప్పుడు ఏం జ‌రుగుతోందో అర్థంకాని గంద‌ర‌గోళాన్ని సృష్టించింది క‌రోనా.

ప్రభాస్- చ‌ర‌ణ్ - తార‌క్- బ‌న్ని లాంటి స్టార్లు వ‌ర‌స పెట్టి పాన్ ఇండియా సినిమాల‌కు సంత‌కాలు చేస్తుంటే ఓవైపు క‌రోనా వెంట‌ప‌డుతోంది. దీంతో వెంట వెంట‌నే సినిమాలు చేయ‌లేని ధైన్యం నెల‌కొంది. ఇక చ‌ర‌ణ్ - తార‌క్ న‌టించిన పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఇప్ప‌ట్లో సాధ్య‌ప‌డ‌లేదు. ఇంకో 20రోజుల పెండింగ్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తే కానీ ఆ ఇద్ద‌రినీ రాజ‌మౌళి విడిచిపెట్ట‌రు. 2022 సంక్రాంతి రిలీజ్ ల‌క్ష్యంగా వీఎఫ్ ఎక్స్ ప‌నుల్ని పూర్తి చేయాల్సి ఉంది. ఇక త‌దుప‌రి కొర‌టాల‌తో ఆగ‌స్టు నుంచి తార‌క్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సి ఉండ‌గా.. చ‌ర‌ణ్ శంక‌ర్ తో సినిమా కోసం వెయిటింగ్. దీనిపై మ‌రో మూడు వారాల్లో కానీ క్లారిటీ రాదు.

మ‌రోవైపు ప్ర‌భాస్ రాధేశ్యామ్ రిలీజ్ విష‌యంలో ఆదిపురుష్ - స‌లార్ చిత్రీక‌ర‌ణ‌ల విష‌యంలోనూ డైల‌మాలో ఉన్నాడు. రాధేశ్యామ్ త్వ‌ర‌లో రిలీజ్ కి వ‌చ్చేసినా.. మిగ‌తా రెండిటిని వేగంగా పూర్తి చేసి 2022లో రిలీజ్ చేయాల్సి ఉంది. అలాగే పుష్ప డ్యూయాల‌జీని వేగంగా పూర్తి చేయాల‌ని ఐక‌న్ ని ఆ రెండిటి మ‌ధ్య‌లో పూర్తి చేసి వ‌రుస‌గా మూడింటిని పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ చేసి త‌ర్వాత మురుగ‌దాస్ తోనూ జాతీయ స్థాయి సినిమా తీయాల‌న్న బ‌న్ని క‌ల తొంద‌ర‌గా నెర‌వేర‌డం లేదు.

మ‌రోవైపు కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా చేయాల‌ని తార‌క్ భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ విష‌యంలో సందిగ్ధ‌త పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌లు వెర‌సి అత‌డు క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నాడు. ఓవ‌రాల్ గా పాన్ ఇండియా స్టార్ల‌కు బ్యాడ్ డేస్ అనూహ్యంగా ఎదుర‌య్యాయి. అది కూడా క‌రోనా మ‌హ‌మ్మారీ తెచ్చిన ముప్పు. సాధ్య‌మైనంత తొంద‌ర‌లోనే ఈ స‌మ‌స్య‌కు సొల్యూష‌న్ దొరుకుతుంద‌నే అంద‌రి హోప్.