Begin typing your search above and press return to search.

రీమేక్ కోసం బాబాయ్ - అబ్బాయ్ కలుస్తారా..?

By:  Tupaki Desk   |   25 May 2020 10:10 AM GMT
రీమేక్ కోసం బాబాయ్ - అబ్బాయ్ కలుస్తారా..?
X
మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య రీమేక్ సినిమాల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా సౌత్ సినిమాలను బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో సౌత్‌లోనే ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేస్తున్నారు. తాజాగా మలయాళంలో సూపర్‌ హిట్ అయిన ఓ మల్టీ స్టారర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్పటినుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతేడాది మలయాళంలో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ "అయ్యప్పనుమ్ కోషియం". ఈ సినిమాలో బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అంత ఇద్దరు వ్యక్తుల ఇగోల పై నడుస్తుంది. ఒక రిటైర్డ్ హవాల్దారుకి, ఒక పోలీస్ ఆఫీసర్ కి మధ్య చెలరేగిన బలమైన ఇగోల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది.

అంతటి బలమైన పాత్ర చిత్రణతో తెరకెక్కించారు డైరెక్టర్ సాచి. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం సౌత్ ఇండియన్ నిర్మాతలు ప్రయత్నించిన విషయం తెలిసిందే. చివరిగా ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లపై తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హవాల్దారు పృథ్వీరాజ్ పాత్ర కోసం హీరో రానాని ఓకే చేశారు. ఇక మరో కీలక బిజూ మీనన్ పాత్రకోసం బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నారు. కానీ బాలకృష్ణ ఆ పాత్ర చేసేందుకు ముందుకు రాకపోవటంతో ఆ పాత్రకోసం విక్టరీ వెంకటేష్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక ఈ సినిమా చేయడానికి విక్టరీ వెంకీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఇక కాస్ట్ అంతా సెట్ అయితే లాక్‌ డౌన్‌ పూర్తయిన వెంటనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. అధికారిక ప్రకటన కోసం మాత్రం ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సిందే!