Begin typing your search above and press return to search.

సినిమా హిట్టయినా.. పేరొస్తుందా?

By:  Tupaki Desk   |   30 July 2021 6:22 AM GMT
సినిమా హిట్టయినా.. పేరొస్తుందా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం నటుడు కాదు. ఫిలిం మేకర్ కూడా. కథలు.. స్క్రీన్ ప్లేలు రాశాడు.. దర్శకత్వం కూడా చేశాడు. వేరే సాంకేతిక విభాగాలపైనా పట్టు సాధించాడు. ఈ నేపథ్యంలో సినిమాల మేకింగ్ పరంగా పవన్ ఎక్కువ జోక్యం చేసుకుంటాడని అంటుంటారు. అందుకే పేరున్న దర్శకులు పవన్‌తో సినిమా చేయడానికి తటపటాయిస్తారని ఇండస్ట్రీలో ఒక చర్చ నడుస్తుంటుంది. ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్‌కే పవన్‌తో బాగా లంకె కుదిరి.. తరచుగా సినిమాలు చేస్తుంటాడు. వీళ్లద్దిరికీ బాగా సింక్ అవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. చివరగా వీళ్లిద్దరూ కలిసి ‘అజ్ఞాతవాసి’ అనే డిజాస్టర్ మూవీ చేశారు. ఆ మరకల్ని చెరిపేస్తూ.. ఇప్పుడు ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ కోసం జతకట్టారు. ఇది రీమేక్ మూవీ అయినా.. దీని స్క్రిప్టుకు త్రివిక్రమ్ టచ్ ఇచ్చాడు. ఈ సినిమాకు రచయిత ఆయనే. స్టోరీ, స్క్రీన్ ప్లే అడాప్షన్‌తో పాటు మాటలు కూడా అందిస్తున్నాడు త్రివిక్రమ్.

ఐతే కేవలం స్క్రిప్టు పని పూర్తి చేసి దర్శకుడు సాగర్ చంద్రకు అప్పగించడంతో సరిపెట్టకుండా ఈ సినిమా మేకింగ్ మొత్తం తన చేతుల మీదుగా జరిగేలా చూస్తున్నాడన్నది చిత్ర వర్గాల సమాచారం. ప్రతి రోజూ త్రివిక్రమ్ సెట్లో ఉంటున్నాడట. మేకింగ్‌ను పర్యవేక్షిస్తున్నాడట. ఒక రకంగా ఆయన షాడో డైరెక్టర్ అని.. ఆయన కనుసన్నల్లోనూ అంతా జరుగుతోందని అంటున్నారు. ఈ చిత్రం తెరకెక్కుతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ త్రివిక్రమ్‌కు హోమ్ బేనర్ లాంటిదే. దీంతో మేకింగ్ పరంగా ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగానే ఉంటోంది. ఇటీవల రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలోనూ దర్శకుడు సాగర్ కంటే త్రివిక్రమే హైలైట్ అయ్యాడు. ఒకవైపు పవన్ కళ్యాణ్.. ఇంకోవైపు త్రివిక్రమ్ ఉండగా.. ఇక సాగర్‌ తన ముద్ర వేయడానికి ఏముంటుందని.. సినిమా సక్సెస్ అయినా కూడా అతడికి పేరు రావడం కష్టమే అని.. పవన్-త్రివిక్రమ్‌ల క్రెడిట్లోకే అంతా వెళ్లిపోతుందని.. పవన్‌తో సినిమా చేస్తున్నానన్న సంబరమేమో కానీ.. ఈ దర్శకుడికి ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ ద్వారా దక్కే ప్రయోజనం పెద్దగా లేకపోవచ్చని ఇండస్ట్రీలో డిస్కషన్ నడుస్తోంది.