Begin typing your search above and press return to search.

ఈవెంట్ల తీరు మారాల్సిందేనా

By:  Tupaki Desk   |   21 Aug 2019 1:30 AM GMT
ఈవెంట్ల తీరు మారాల్సిందేనా
X
రాను రాను టాలీవుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెద్ద ప్రహసనంగా మారుతున్నాయి. రెండున్నర గంటల సినిమాలకు ఐదేసి గంటల సేపు వేడుకలు జరిపి అభిమానుల సమయాన్ని అంతంత సేపు బ్లాక్ చేసి ఉంచడం పట్ల ఇటీవలి కాలంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు ఉదాహరణగా సాహో గురించే చెప్పొచ్చు. రామోజీ ఫిలిం సిటీలో మొన్న ఆదివారం జరిగిన ఈ ఈవెంట్ ని లైవ్ లో టీవీలో యుట్యూబ్ లో టెలికాస్ట్ చేశారు.

ఆన్ లైన్లో దీన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళ సంఖ్య సుమారుగా కోటి 40 లక్షల దాకా ఉందట. ఇండస్ట్రీ డిజాస్టర్ గా చెప్పుకునే అజ్ఞాతవాసికి గతంలో లైవ్ ద్వారా కోటి 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒక్క హీరో ఇమేజ్ ల పోలికలను పక్కనబెడితే మిగిలిన అన్ని విషయాల్లోనూ సాహో అజ్ఞాతవాసి కంటే ఎన్నో రెట్లు పైన నిలుస్తుంది. అయినా కూడా వ్యూస్ తక్కువగా వచ్చాయి కారణమేంటో ఆలోచించాలి

ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటే. సంవత్సరాలు గడుస్తున్నా ఈవెంట్లు నడిపిస్తున్న తీరు మాత్రం ఒకేలా ఉంటోంది యాంకర్లతో సహా, విసుగు వచ్చే దాకా సదరు హీరో పాత సినిమాల పాటలు పాడించడం డాన్సులు చేయించడం వచ్చిన అతిధులతో స్పీచులు ఇప్పించి టైంని ఐస్ క్రీంలా తినేయడం సర్వసాధారణం అయిపోయింది. ఓ రెండు మూడు గంటల తర్వాత హీరో ఎంట్రీ ఆ తర్వాత చివరి అరగంట హడావిడిగా కాసేపు మాట్లాడించేసి వెళ్లిపోవడం ఇదంతా ప్రతి సినిమా విషయంలోనూ జరుగుతోంది.

సింపుల్ గా త్వరగా ముగించేసి వచ్చినవాళ్ళను ఓ అనుభూతిని మిగులుద్దామన్న ఉద్దేశం ఎవరికీ ఉండటం లేదు. టెలికాస్ట్ లో ఎంత ఎక్కువ సేపు ప్రసారం జరిగితే అంత రెవిన్యూ యాడ్స్ వస్తాయనేది మీడియా సంస్థల ప్లాన్ కావొచ్చు. కానీ ఇలా లెన్త్ ఎక్కువవుతూ వెళ్తే ఆఖరికి ప్రేక్షకులు వాళ్లకు కావాల్సిన వీడియోలు బైట్లు యూట్యూబ్ లో చూసి సర్దుకునే ట్రెండ్ వచ్చేస్తుంది.