Begin typing your search above and press return to search.

తెర మీదకు మరో భారీ మల్టీస్టారర్..?

By:  Tupaki Desk   |   25 Sep 2021 2:30 PM GMT
తెర మీదకు మరో భారీ మల్టీస్టారర్..?
X
మెగాస్టార్ చిరంజీవి - కింగ్ అక్కినేని నాగార్జున మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరు - నాగ్ ఇద్దరూ మంచి స్నేహితులుగానే కాకుండా ఒకే ఫ్యామిలీ అనుకునేలా మెలుగుతుంటారు. ఈ క్రమంలో కలిసి వ్యాపారులు కూడా చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని సినీ అభిమానులు ఆశపడుతుంటారు. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన వందవ చిత్రాన్ని చిరంజీవి - నాగార్జున లతో చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ.. కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో త్వ‌ర‌లోనే వీరిద్దరూ క‌లిసి న‌టించబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

2017లో తమిళ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ''విక్రమ్ వేద'' చిత్రాన్ని ఇతర భాషల్లోకి రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ రీమేక్ గురించి ఎక్కువ చర్చలు జరిగాయి. చాలా మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ.. ఇంతవరకు ఈ మల్టీస్టారర్ మీద క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో లేటెస్టుగా చిరంజీవి - నాగార్జున ఈ రీమేక్ లో నటిస్తారని టాక్ నడుస్తోంది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఇప్పటికే 'విక్రమ్ వేదా' రీమేక్ రైట్స్ తీసుకుందట. త్వరలో నాగ్ - చిరు లతో ఈ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక సాధ్యమైతే ఇదొక క్రేజీ మల్టీస్టారర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

టాలీవుడ్ సూపర్ సీనియర్ హీరోలు ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - శోభన్ బాబు - కృష్ణంరాజు వంటి వారు మల్టీస్టారర్స్ చేశారు కానీ.. ఆ తర్వాతి తరం హీరోలైన చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలకృష్ణ కలిసి నటించడానికి ఆసక్తి చూపించలేదు. దానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. కానీ ఇప్పుడు హీరోలతో పాటుగా సినీ అభిమానుల అభిరుచుల్లో కూడా మార్పులు వచ్చాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో అనేక మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు చిరు - నాగ్ కలిసి నటిస్తారో లేదో చూడాలి.

కాగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ప్రధాన పాత్రలతో ''విక్రమ్ వేద'' సినిమా తెరకెక్కింది. గ్యాంగ్‌ స్టర్‌ - పోలీస్‌ ఆఫీసర్‌ మధ్య నడిచే థ్రిల్లింగ్ డ్రామాగా పుష్కర్‌-గాయత్రి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో పోలీస్ విక్రమ్ గా మాధవన్.. గ్యాంగ్‌ స్టర్‌ వేదా గా సేతుపతి నటించారు. తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. బాలీవుడ్ స్టార్స్ హృతిక్‌ రోషన్‌ - సైఫ్‌ అలీఖాన్‌ లతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన పుష్కర్‌-గాయత్రి దీని బాధ్యతలు తీసుకున్నారు. 2022 సెప్టెంబర్‌ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి త్వరలోనే తెలుగు రీమేక్ పై కూడా స్పష్టత వస్తుందేమో చూడాలి.