Begin typing your search above and press return to search.

సరోగేట్ అడ్వర్టైజింగ్ బారిన పడ్డ అమితాబ్...అసలు విషయం తెలిసి గుడ్ బై!

By:  Tupaki Desk   |   15 Oct 2021 12:30 PM GMT
సరోగేట్ అడ్వర్టైజింగ్ బారిన పడ్డ అమితాబ్...అసలు విషయం తెలిసి గుడ్ బై!
X
సినీ స్టార్స్ తమకంటూ ఒక గుర్తింపు వచ్చాక కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వాటి యాడ్స్ లలో నటిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ ప్రమోషన్స్ ఎంతగా పెరిగిపోయాయి అంటే సినిమాల్లో సంపాదిస్తున్న దానితో సమానంగా బ్రాండ్ ప్రమోషన్స్ లో రాబడి వస్తుండడంతో ఎక్కువగా దాని మీద దృష్టి పెడుతున్నారు స్టార్ హీరోలు. కానీ ఒక్కోసారి వాళ్లు ప్రమోట్ చేసే బ్రాండ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా పాన్ మసాలా వంటి యాడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్, షారుక్ ఖాన్ అజయ్ దేవగన్ వంటి వాళ్లు పాన్ మసాలా కంపెనీ వాణిజ్య ప్రకటనలో కనపడటంతో సాధారణ ప్రేక్షకులు ముక్కున వేలేసుకునే పరిస్థితి. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిన గుట్కా, పాన్ మసాలా వాడకం ఎక్కువ. దాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు సహా ఎన్నో సంస్థలు పోరాడుతున్నాయి. అలాంటి సమయంలో ప్రజలను ఎంతో ప్రభావితం చేసే హీరోలు ఇలాంటి వాటిని ప్రోమోట్ చేస్తే ఊరుకుంటారా, చిన్న హీరోలను వదిలేశారు కానీ అమితాబ్ బచ్చన్ లాంటి బడా స్టార్ హీరో ఈ వయసులో కూడా డబ్బు కోసం అలాంటి ప్రకటనల్లో నటించడం అవసరమా అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.

అయితే అమితాబ్ బచ్చన్ ఈ యాడ్ లో నటించడం వెనుక ఒక మతలబు ఉంది. ఒకరకంగా ఆయనకు తెలియకుండానే బురిడీ కొట్టించారు. దానిని సరోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. అంటే ప్రకటనలో చూపించేది ఒకటి, అసలు ఉండేది ఒకటి. లిక్కర్ కి ప్రమోషన్ అనేది భారతదేశంలో చట్ట ప్రకారం చేయకూడదు. గమనించినట్లయితే లిక్కర్ కి సంబంధించిన ప్రకటనలలో ఎక్కువగా మ్యూజిక్ సిడిలు లేదా సోడా బాటిల్ ను ప్రమోట్ చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇక అమితాబ్ బచ్చన్ విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు.

సరోగేట్ అంటే ఒక ప్రత్యామ్నాయం లేదా ఒకరికోసం ఏదైనా ఒక పని చేసే శక్తిని/ అధికారాన్ని మరొకరికి ఇవ్వడం. సరోగసీ లేదా సరోగేట్ మదర్స్ అనే పదాలను మీరు వినే ఉంటారు. ఇక్కడ ఒక స్త్రీ వేరొక మహిళ కోసం పిల్లల్ని కంటుంది. సరోగేట్ అడ్వర్టైజింగ్ కూడా ఇదే విధానాన్ని పాటిస్తుంది. ఒక ప్రొడక్ట్ అడ్వర్టైజ్ చేయడానికి కుదరనప్పుడు.. అది వేరొక ప్రొడక్ట్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటుంది. దీన్నే సరోగేట్ అడ్వర్టైజింగ్ అని పిలుస్తారు. ఉదాహరణకి సమాజహితం కాని గుట్కా ప్రొడక్ట్స్ భారతదేశంలో ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. అందుకే ఈ గుట్కా ప్రొడక్ట్స్ తెలివిగా పాన్ మసాలా ప్రొడక్ట్స్ ముసుగులో మార్కెట్లోకి వచ్చి ప్రమోషన్ చేసుకుంటాయి.

ఈ గుట్కాను పాన్ మసాలా పేరుతో కొన్ని బ్రాండ్స్ ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇలాంటి పాన్ మసాలాను అమితాబ్ బచ్చన్ ప్రమోట్ చేస్తుండడంతో ఓ యాంటీ-టొబాకో సంస్థ ప్రచారం ఆపాలని అతనికి విజ్ఞప్తి చేసింది. పొగరాకుండా నమిలే ఖైనీ, గుట్కా ఉత్పత్తుల క్యాన్సర్ కారకాలు కాగా వీటి వాడకం భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే డొంకతిరుగుడు పద్ధతిలో మార్కెట్లోకి వచ్చే పాన్ మసాలాను ప్రమోట్ చేయకూడదని బిగ్ బీ నిర్ణయించుకున్నారు.

అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ప్రకటనల స్వీయ నియంత్రణకు లక్ష్యంగా తీసుకొచ్చిన ఒక సంస్థ. ఇది కూడా కేబుల్ టెలివిజన్ నియమాలలో పేర్కొన్న విధంగానే ఉత్పత్తుల ప్రమోషన్లకు అనుమతిస్తుంది. దీనితో ఆరోగ్యపరమైన ప్రొడక్ట్స్ గానే అనారోగ్యకరమైన ఉత్పత్తులు సులభంగా ప్రజలకు చేరువ అవుతున్నాయి. అయితే కేబుల్ టెలివిజన్ రూల్స్ ప్రకటనలు ప్రసారం చేసే ముందు వాటిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వెరిఫై చేయాల్సిందిగా చెబుతున్నాయి.

భారతదేశంలో సంభవిస్తున్న మరణాలకు, వ్యాధులకు పొగాకు వాడకం ఒక ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. పొగాకు వినియోగం ప్రతి సంవత్సరం దాదాపు 1.35 మిలియన్ల మరణాలకు కారణమవుతుందని సంస్థ తెలిపింది. భారతదేశం.. ప్రపంచంలో రెండవ అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారుగా, వినియోగదారుగా ఉంది. 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు గల 267 మిలియన్ల మంది భారతీయులు పొగాకు ఆధారిత ఉత్పత్తులను వాడుతున్నారు.