Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్‌ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   31 March 2020 5:30 AM GMT
అల్లు శిరీష్‌ కీలక ప్రకటన
X
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా 2013లో గౌరవం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్‌ సక్సెస్‌ కోసం చకోరా పక్షి తరహాలో ఈ ఏడు సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒకటి రెండు పర్వాలేదు అనిపించినా కూడా కమర్షియల్‌ గా మాత్రం ఇప్పటి వరకు శిరీష్‌ కు బ్రేక్‌ దక్కలేదు. దాంతో సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈయనతో సినిమాలు చేసేందుకు చాలా మంది ఆసక్తిగానే ఉంటున్నారు. ఎవరు లేకున్నా సొంత బ్యానర్‌ లో వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉన్నా కూడా శిరీష్‌ మాత్రం ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు.

అల్లు శిరీష్‌ సినిమా వచ్చి సంవత్సరం దాటింది. అయినా ఇప్పటి వరకు కొత్త సినిమా ప్రకటనే రాలేదు. ఈయన తదుపరి చిత్రం విషయంలో చాలా వార్తలు మీడియాలో వచ్చాయి. ఆ దర్శకుడితో ఈ దర్శకుడితో ఆ కథతో ఈ కథతో అంటూ చాలా చాలా కథనాలు అయితే వచ్చాయి. కాని ఇప్పటి వరకు అధికారిక క్లారిటీ మాత్రం రాలేదు. తాజాగా ఒక ఫాలోవర్‌ ట్విట్టర్‌ లో తదుపరి చిత్రం గురించి చెప్పాలంటూ పదే పదే రిక్వెస్ట్‌ చేయడంతో శిరీష్‌ స్పందించాడు.

అతి త్వరలోనే ఒక ఎంటర్‌ టైన్‌ మెంట్‌ చిత్రంతో మీ ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటించాడు. అది ఎప్పుడు ఎవరితో అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ చిత్రాలకు మంచి డిమాండ్‌ ఉంది. అందుకే శిరీష్‌ ఆ దారిలో నడువబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాకేశ్‌ శశి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు శిరీష్‌ ఓకే చెప్పాడట. ఆ సినిమా ప్రకటన రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ కరోనా ప్రభావం తగ్గిన వెంటనే షూటింగ్స్‌ మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. విజేత చిత్రంతో దర్శకుడు రాకేశ్‌ శశి అందరికి పరిచయమే. ఆ సినిమా ఫ్లాప్‌ అయినా ఆయన చెప్పిన స్క్రిప్ట్‌ నచ్చడంతో శిరీష్‌ ఆ సినిమాకు కమిట్‌ అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు శిరీష్‌ నుండి ఒక ప్రకటన రావడం తో ఫ్యాన్స్‌ ఇంకా ప్రేక్షకులు హమ్మయ్య అనుకుంటున్నారు.