Begin typing your search above and press return to search.

ఒకే వేదికపై 'మెగా' బావ-బావమరిది.. రూమర్స్ కు చెక్ పెట్టడానికేనా..?

By:  Tupaki Desk   |   24 Jun 2022 4:30 AM GMT
ఒకే వేదికపై మెగా బావ-బావమరిది.. రూమర్స్ కు చెక్ పెట్టడానికేనా..?
X
యాక్షన్ హీరో గోపీచంద్ మరియు డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ''పక్కా కమర్షియల్'. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ మూవీ జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జూన్ 26న హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా వేదికను పంచుకోనున్నారు.

ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీలో చీలికలు వచ్చాయని.. అల్లు కాంపౌండ్ కి మెగా కాంపౌండ్ కి మధ్య సంబంధాలు బాగా లేవని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. అల్లు ఫ్యామిలీ 'మెగా' ముద్ర తొలగించుకొని తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నారని రూమర్స్ కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో మెగాకి అల్లుకి మధ్య దూరం పెరిగిందని అనుకున్నారు.

అల్లు - మెగా ఫ్యామిలీల మధ్య పొసగడం లేదని.. రెండు కుటుంబాల మధ్య ఏదో సైలెంట్ వార్ జరుగుతుందంటూ వార్తలు వస్తున్న తరుణంలో.. ఇప్పుడు చాలా రోజుల తర్వాత బావా బామ్మర్దులు చిరంజీవి - అల్లు అరవింద్ ఒకే వేదికను పంచుకోనుండడం ప్రాధాన్యత సంతరించుకోనుంది. తమ ఫ్యామిలీల మధ్య ఏదో వ్యవహారం జరిగిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పడానికి 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మారబోతోంది.

బయట ఎన్ని రూమర్స్ వచ్చినా.. ఎన్ని తప్పుడు ప్రచారాలు జరిగినా మెగా - అల్లు కుటుంబాలు ఎప్పుడూ కలిసి ఉంటాయని చిరంజీవి - అల్లు అరవింద్.. మరోసారి అభిమానులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ముందు నుంచి కూడా మెగా ఫ్యామిలీలో అందరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు.

వారి మధ్య ఎన్ని ఉన్నా బయటకు రానీయకుండా కలిసి మెలిసి ఉన్నట్లే కనిపిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో మెగా vs అల్లు ఆధిపత్య పోరు నడుస్తోందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇరు వర్గాల అభిమానులు వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో తరచుగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం మనం చూస్తుంటాం.

దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మెగా పెద్దలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే అల్లు అరవింద్ సారధ్యంలో నడిచే 'ఆహా' ఓటీటీలో ఓ షోకి చీఫ్ గెస్టుగా చిరంజీవి వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అరవింద్ పర్యవేక్షణలో రూపొందిన 'పక్కా కమర్షియల్' సినిమా ఈవెంట్ కు అతిథిగా రాబోతున్నారు. మరి ఇప్పటికైనా 'మెగా vs అల్లు' రూమర్స్ కు చెక్ పడుతుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే 'పక్కా కమర్షియల్' చిత్రాన్ని జులై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. గీతా ఆర్ట్స్ 2 మరియ యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీకి SKN సహ నిర్మాతగా ఉన్నారు.