Begin typing your search above and press return to search.

పుష్ప' పై బన్నీ క్లారిటీ ఇచ్చినట్లేనా...?

By:  Tupaki Desk   |   9 Aug 2020 5:00 PM GMT
పుష్ప పై బన్నీ క్లారిటీ ఇచ్చినట్లేనా...?
X
అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురములో' సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ జోష్ లో వెంటనే స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో 'పుష్ప' ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు బన్నీ. వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కి జోడీగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తోంది. ఇప్పటికే 'పుష్ప' నుండి రిలీజైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మొరటు కుర్రాడిగా కనిపించడంతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు. ఈ నేపథ్యంలో కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న 'పుష్ప' టీమ్ కి కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. అయితే గత నాలుగు నెలలుగా బన్నీ 'పుష్ప' షూటింగ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు స్టార్ట్ చేయాలనే ఆలోచనలో అదే లుక్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇటీవల బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాకింగ్ పిక్స్ లో కూడా గుబురు గడ్డంతో 'పుష్ప' లుక్ లోనే కనిపించాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కసారిగా లుక్ మార్చేసి కనిపించాడు.

కాగా ఇన్ని రోజులు 'పుష్ప' లుక్ లో కనిపించిన బన్నీ.. నిన్న దగ్గుబాటి రానా వివాహ వేడుకలో గడ్డం ట్రిమ్ చేసుకొని దర్శనమిచ్చాడు. దీంతో ఇప్పట్లో 'పుష్ప' షూటింగ్ లేనట్లేనని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. రోజురోజుకి కరోనా తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో పెద్ద సినిమాల షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ప్రశార్థకంగా మారింది. అందులోనూ 'పుష్ప' సినిమా మెజారిటీ భాగం ఎక్కువ మంది సిబ్బందితో అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అందుకే కరోనా ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదని భావించిన అల్లు అర్జున్.. లుక్ మార్చేసి 'పుష్ప' నుంచి బయటకి వచ్చాడని తెలుస్తోంది. దీంతో 'పుష్ప' షూటింగ్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవని బన్నీ క్లారిటీ ఇచ్చినట్లేనని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తన కెరీర్లో 21వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. యూనివర్సల్ సబ్జెక్టుతో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియన్ లెవల్లో రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని యువసుధ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ మరియు గీతాఆర్ట్స్ 2 అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.