Begin typing your search above and press return to search.

'అడవి తల్లి మాట'.. 'భీమ్లా నాయక్' సారాంశాన్ని వివరించే పాట..!

By:  Tupaki Desk   |   4 Dec 2021 5:27 AM GMT
అడవి తల్లి మాట.. భీమ్లా నాయక్ సారాంశాన్ని వివరించే పాట..!
X
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ''భీమ్లా నాయక్'' చిత్రాన్ని సంక్రాంతి రేసులో నిలపడానికి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్ - ఇద్దరు హీరోల టీజర్లు - మూడు పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'అడవి తల్లి మాట' అనే నాలుగో గీతాన్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

''కిందున్న మడుసులలా.. కోపాలు తెమలవు.. పైనున్న సామేమే కిమ్మని పలకడు..'' సాగిన ఈ పాట శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. 'అడవి తల్లి మాట' పాటకు థమన్ అద్భుతమైన ట్యూన్ సమకూర్చారు. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి దీనికి సాహిత్యం అందించారు. ఈ గీతాన్ని జానపద గాయని కుమ్మరి దుర్గవ్వ మరియు సాహితీ చాగంటి కలిసి ఆలపించారు.

ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అహం - ఆత్మాభిమానం నేపథ్యంలో 'భీమ్లా నాయక్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన 'అడవి తల్లి మాట' పాట ఈ సినిమా సారాంశాన్ని వివరిస్తోంది. భీమ్లా నాయక్ - డేనియల్ శేఖర్ ల మధ్య గొడవల కారణంగా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది ఈ పాటలో చూడొచ్చు.

'తనయూల తగవుల్ల తల్లడిల్లీపోయే.. అడివీతల్లిన్నేను నాయినా' వంటి లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో పవన్ కళ్యాణ్ - రానా లతో పాటుగా హీరోయిన్లు నిత్యా మీనన్ - సంయుక్త మీనన్ కనిపించారు. అలానే ఇందులో రానా తండ్రిగా సముద్ర ఖని ని చూడొచ్చు. రవి కె చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.

'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 2022 జనవరి 12న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.