Begin typing your search above and press return to search.

అమెరికా దీనస్థితిపై హీరోయిన్ చెప్పిన కఠిన నిజాలు

By:  Tupaki Desk   |   8 April 2020 11:30 PM GMT
అమెరికా దీనస్థితిపై హీరోయిన్ చెప్పిన కఠిన నిజాలు
X
కరోనాతో అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. రోజుకు 1500కు పైగా మరణాలు.. 4 లక్షలు దాటిన కరోనా కేసులతో మరణ మృదంగం వాయిస్తోంది. కరోనా దెబ్బకు న్యూయార్క్ లో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. కరోనా భయంతో వాటిని ఎవరూ తీసుకోకపోవడంతో మార్చురీలో మగ్గుతున్నాయి. ఖననం చేయడానికి కూడా స్థలం లేని పరిస్థితి.

ఒకప్పుడు టాలీవుడ్ లో మెరిసిన నటి మాన్య ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటోంది. సీతారామరాజు - ‘బ్యాచ్ లర్స్’ సినిమాలతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ప్రస్తుతం అమెరికాలో ఫైనాన్స్ ప్రొఫెషనల్ గా పనిచేస్తోంది. న్యూయార్క్ లో కుటుంబంతో ఉంటున్న మాన్యా అక్కడి దారుణ పరిస్తితిపై సంచలన విషయాలు చెప్పుకొచ్చింది.

న్యూయార్క్ - న్యూజెర్సీ ఊహకందని రీతిలో కరోనా వేలమందికి సోకిందని మాన్యా ఆవేదన వ్యక్తం చేసింది. లక్షల్లో రోగులను కరోనా కబళిస్తోందని.. శవాల గుట్టలు పేరుకుపోయాయని చెప్పుకొచ్చింది. బంధువులు కూడా శవాలను చూడలేక పోవడంతో క్రేన్లతో శవాలను పూడ్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మా ఫ్రెండ్ నాన్న కరోనాతో చనిపోతే చివరి చూపును కూడా చూడనీయలేదని.. దూరం నుంచి కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బయటకు వెళితే కరోనా సోకుతుందని.. ఇల్లు గడప కూడా ఎవరూ దాటడం లేదని వాపోయింది.

అమెరికాలో కరోనాతో సర్వం బంద్ అయ్యాయని.. నిరుద్యోగులు రోడ్డున పడ్డారని మాన్య తెలిపింది. ఇండియాలో లాక్ డౌన్ తో మరణాలు తగ్గాయని మంచి నిర్ణయమని కొనియాడింది. అమెరికాలో పరిస్థితి చేయిదాటిపోయిందని వివరించింది.