Begin typing your search above and press return to search.

'కష్టేఫలి' అంటున్న మెగాస్టార్.. మేడే స్పెషల్ పోస్ట్!

By:  Tupaki Desk   |   1 May 2021 4:34 PM GMT
కష్టేఫలి అంటున్న మెగాస్టార్.. మేడే స్పెషల్ పోస్ట్!
X
టాలీవుడ్ మెగాస్టార్ సినిమాలతో ఎంతగా అలరిస్తారో.. సోషల్ మీడియాలో కూడా ఎల్లప్పుడూ చురుకుగా పోస్టులు పెడుతూ స్పెషల్ డేస్ గుర్తుచేస్తుంటారు. తాజాగా మెగాస్టార్ ఇంస్టాగ్రామ్ వేదికగా మే డేను గుర్తుచేస్తూ పోస్ట్ పెట్టారు. అలాగే ఆయన నమ్మే సిద్ధాంతం గురించి కూడా పోస్ట్ ద్వారా తెలియజేసారు. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ ఆచార్య నుండి ఓ రఫ్ లుక్ ఫోటో పోస్ట్ చేసి ఆయన చెప్పాల్సింది చెప్పేసారు. అయితే ఆ ఫోటోలో మెగాస్టార్ కష్టం కనిపిస్తుందనే చెప్పాలి. ఫోటోతో పాటు.. "అందరికి మేడే శుభాకాంక్షలు. కష్టేఫలి అనేది మన నానుడి. మనం పడే కష్టమే మనకు నిజమైన ప్రతిఫలాన్ని అందజేస్తుంది. నేను కూడా ఎల్లప్పుడూ నమ్మే సిద్ధాంతం ఇది.

శ్రమైక సౌందర్యాన్ని గుర్తుచేసే ఈ రోజు ప్రపంచంలోని నిత్య శ్రామికులందరికి వందనాలు.. అభివందనాలు" అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మెగాస్టార్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఆయన పోస్టుకు బదులుగా అభిమానులు, నేటిజన్లు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ - కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా రూపొందుతుంది. ఇది మెగాస్టార్ కెరీర్లో 152వ సినిమా కావడం విశేషం. అందుకే భారీ బడ్జెట్ తో మంచి సందేశంతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టీజర్, పాటలు వింటేనే తెలుస్తుంది. ఈ సినిమా పై మెగాస్టార్ తో పాటు మెగా అభిమానులు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.

ఎందుకంటే డైరెక్టర్ కొరటాల శివ ప్రతి సినిమాలో సమాజానికి సంబంధించిన కొత్త కథాంశంతో సినిమాలను తెరమీదకు తీసుకొస్తారనేది విదితమే. ఆచార్య సినిమా మే 13న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా పరిస్థితి కారణంగా సినిమాను మేకర్స్ వాయిదా వేశారు. కానీ మళ్లీ రిలీజ్ ఎప్పుడనేది తెలియాలంటే పరిస్థితులు మాములు స్థితికి వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమాను రాంచరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా.. రాంచరణ్ - పూజాహెగ్డే కీలకపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు పన్నెండేళ్ల తర్వాత మణిశర్మ మెగాస్టార్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చూడాలి మరి మెగాస్టార్ ఆచార్యగా ఎప్పుడు దర్శనమిస్తారో..!