Begin typing your search above and press return to search.

ఆ 49 మంది సెలెబ్రిటీలకు మద్దతుగా 180 మంది సెలెబ్రిటీలు

By:  Tupaki Desk   |   9 Oct 2019 10:33 AM GMT
ఆ 49 మంది సెలెబ్రిటీలకు మద్దతుగా 180 మంది సెలెబ్రిటీలు
X
గత జులై నెలలో 49 మంది సెలెబ్రిటీలు భారత దేశంలో అసహనం పెరిగిపోతుందని - సామూహిక హత్యలు ఈ దేశానికే మచ్చ తెస్తున్నాయని వీటిని అరికట్టాలని ప్రధాని మోడీకి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. అయితే ఈ లేఖపై బీహార్ కి చెందిన వ్యక్తి ఆ లేఖ మతపరమైన భావాలను రెచ్చగొట్టేట్టు ఉందని ఆ 49 మందిపై దేశద్రోహం కేసు వేశారు. దీంతో బీహార్ పోలీసులు వీళ్లపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసుపై కేంద్ర ప్రభుత్వాన్ని చాలా మంది సెలెబ్రిటీలు విమర్శిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా - హిస్టారియన్ రొమిలా థాపర్ - వాజ్ పేయ్ - జెర్సీ పింట్ - టీ ఎం కృష్ణ లాంటి 180 మంది ఆ 49 మందికి మద్దతుగా సోమవారం ఒక లేఖ విడుదల చేశారు. 49 మంది సెలెబ్రిటీలు రాసిన లేఖలో తప్పు ఏం ఉందని - ఆ లేఖపై రాజద్రోహం కేసు ఎలా పెడతారని వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ప్రజలను - ప్రముఖులను కోర్టుల ద్వారా ఇబ్బందులకు గురి చేస్తుందని అభిప్రాయపడ్డారు. తమిళ నటుడు - రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఈ కేసుని కక్ష సాధింపు చర్య అని విమర్శించారు.

అయితే బీజేపీ ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని - మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను తాము అడ్డుకోబోమని - తమ పార్టీ మీద - ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని కేంద్ర సమాచార - ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. పోలీసులు మాత్రం ఈ కేసుని సీరియస్ గా తీసుకోవట్లేదని - ఇప్పటివరకు ఈ కేసు ఫైల్ ని కోర్ట్ కి కూడా సబ్మిట్ చేయలేదని అంటున్నారు.