నాలుగో భార్యతో ఎంపీకి విడాకులు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
అవును... 'మీ నాలుగో భార్యకు ప్రతినెలా రూ.30వేలు చెల్లించండి' అంటూ అలహాబాద్ హైకోర్టు, సమాజ్ వాద్ పార్టీ ఎంపీ మొహిబబ్బుల్లా నద్వీని ఆదేశించింది.
By: Raja Ch | 16 Oct 2025 3:20 PM ISTతన నాలుగో భార్యకు క్రమం తప్పకుండా భరణం చెల్లించాలని లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలని.. సమాజ్ వాదీ పార్టీ రాంపూర్ ఎంపీ మొహిబ్బల్లా నద్వీని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. కొనసాగుతున్న వైవాహిక వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం కోర్టు ఈ కేసును తన మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... 'మీ నాలుగో భార్యకు ప్రతినెలా రూ.30వేలు చెల్లించండి' అంటూ అలహాబాద్ హైకోర్టు, సమాజ్ వాద్ పార్టీ ఎంపీ మొహిబబ్బుల్లా నద్వీని ఆదేశించింది. ఇదే సమయంలో... భరణం క్రమంతప్పకుండా చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... రాంపుర్ ఎంపీ అయిన నద్వీ, తన నాలుగో భార్య నుంచి విడిపోయే విషయంపై ఆగ్రాలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో ఆ కుటుంబ న్యాయస్థానం 2024 ఏప్రిల్ 1న ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారిస్తూ జస్టిస్ శుభాష్ చంద్ర శర్మ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలో విచారణ సందర్భంగా నద్వి తరపు న్యాయవాది వాదిస్తూ.. ఇది వైవాహిక వివాదానికి సంబంధించిన విషయమని.. దీనిని సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశం నద్వీకి ఉందని తెలిపారు. దీంతో సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు అవకాశం ఇస్తున్నట్లు జస్టిస్ శుభాష్ చంద్ర శర్మ పేర్కొన్నారు.
మూడు నెలల సమయం ఇచ్చిన కోర్టు!:
ఎంపీ నద్వీ న్యాయవాది అభ్యర్ధన మేరకు.. రెండు పార్టీలు రాజీకి రావడానికి కోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది. ఇంతలో.. మధ్యంతర భరణంగా నెలకు రూ.30,000 సహా రూ.55,000 డిపాజిట్ చేయాలని నద్విని ఆదేశించింది. ఎంపీ భరణం చెల్లించడంలో విఫలమైతే ఆ తర్వాత చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.
