వైసీపీ ఎంపీ: ఇరికించాలని చూసి ఇరుక్కున్నారు..!
వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి అడ్డంగా ఇరుక్కున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఇరికించాలని చూసిన ఆయన.. స్వయంగా ఆయనే ఇరుక్కోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
By: Garuda Media | 15 Aug 2026 8:00 AM ISTవైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి అడ్డంగా ఇరుక్కున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఇరికించాలని చూసిన ఆయన.. స్వయంగా ఆయనే ఇరుక్కోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అనవసరంగా వేలు పెట్టానేమో.. అని ఆయన చింతిస్తున్నారట. రెండు కీలక విషయాలపై గురుమూర్తి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహ రించారు. వాస్తవానికి ప్రతిపక్ష ఎంపీగా ఆయన డ్యూటీ చేయాలని అనుకున్నా.. అలివికాని పరిస్థితిలో ఆయన జోక్యం చేసుకోవడం వివాదాన్ని కొని తెచ్చుకున్నట్టు అయింది.
విజయవాడ, కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు వ్యవహారం ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం పరిధిలో ఉంది. దీనిని ప్రభుత్వం కూడా సీరియస్గానే తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సీఐ సహా.. కానిస్టేబుళ్లను జైలుకు పంపించారు. అయితే.. ఈ కేసులో విజయవాడ పోలీసు కమిషనర్ సహా డీజీపిని కూడా నిందితులుగా చేర్చాలని కోరుతూ. గురుమూర్తి విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. కానీ, వాస్తవానికి ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని ఆయనే ఒప్పుకొన్నారు.
అయినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. హైకోర్టు ఈ విషయాన్నే ప్రశ్నించిం ది. అసలు మీ పరిధి కానప్పుడు.. మీరు ఎలాజోక్యం చేసుకుంటారో చెప్పాలని నిలదీసింది. అనంతరం.. సదరు విచారణపై స్టే విధించింది. ఇక, కర్నూలులో కూడా ఓ కేసు విషయంలో ఎంపీ జోక్యం చేసుకున్నారు. అక్కడ గంగమ్మ అనే మహిళ చనిపోయారు. దీనిలో పోలీసుల పాత్ర ఉందంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిని కూడా కోర్టు తోసిపుచ్చింది. ఇలా.. ఈ రెండు కేసుల్లోనూ గురుమూర్తి సర్కారును ఇరికించే ప్రయత్నం చేసి తానే ఇరుక్కుపోయారు.
నియోజకవర్గంలో కూడా..
గురుమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతి పార్లమెంటు పరిధిలోనూ ఆయన గ్రాఫ్ తగ్గుముఖం పడుతోందని నివేదికలు చెబుతున్నాయి. టీడీపీ చేయిస్తున్న అంతర్గత సర్వేల్లో వైసీపీ ఎంపీ ప్రభావం తగ్గిపోయిందని.. కూటమి నాయకుల పనితీరు బాగుందని తెలుస్తోంది. ప్రజలను కలుసుకోవడం నుంచి సమస్యల పరిష్కారం వరకు కూడా తిరుపతి ఎంపీ వెనుకబడ్డారని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభావం ఉన్నప్పటికీ గురుమూర్తి విజయం దక్కించుకున్నారు. కానీ, రెండేళ్లు తిరిగే సరికి ఆయన గ్రాఫ్ తగ్గిపోవడం గమనార్హం.
