'శాంతి'పై అశాంతి: పాతపట్నం..రూటెటు.. ?
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ చూస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. గెలుపు తనదేనని జగన్ చెబుతున్నారు.
By: Garuda Media | 27 March 2026 10:00 PM ISTవచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ చూస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. గెలుపు తనదేనని జగన్ చెబుతున్నారు. అయితే.. నియోజకవర్గాల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క విధంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం వైసీపీలో రెడ్డి శాంతి వ్యవహారం రాజకీయంగా పార్టీకి బెడిసి కొడుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ విజయం దక్కించుకుంది. మామిడి గోవిందరావు విజయం సాధించారు. ఇక, అప్పటి నుంచి రెడ్డి శాంతి వైసీపీ తరఫున దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలన్న సీనియర్ల సూచనలను కూడా ఆమె దూరం పెట్టారు. ఎవరినీ పట్టించుకోవడం లేదు. పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. దీంతో మెజారిటీ కార్యకర్తలు.. ఇప్పుడు టీడీపీకి చేరువయ్యారు.
ముఖ్యంగా రెడ్డి శాంతిపై సొంత నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. ''ఆమె ఓడిపోయారన్న విషయం మాకు మాత్రమే తెలుసు. ఆమె ఇంకా ఎమ్మెల్యే అన్న భావనతోనే ఉన్నారు. మాకు కనిపించరు. మాతో మాట్లాడరు. కనీసం ఫోన్లు చేసినా స్పందించరు'' అని సీనియర్ నాయకులు.. ఇటీవల పార్టీ నేత, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. జిల్లాలో వాస్తవానికి వైసీపీ పరిస్థితి ఎవరికి వారే అన్నట్టుగా ఉంది.
ఒక్క పాతపట్నంలోనే కాదు.. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్న సమాచారం పార్టీకి కూడా చేరింది. కానీ, అందరూ సీనియర్ నాయకులే కావడంతో వారిని ఏమీ అనే పరిస్థితి లేదు. అయితే.. ఇలా ఉదాశీనంగా వ్యవహరిస్తే.. పార్టీ లక్ష్యం నెరవేరుతుందా? అనేది ప్రశ్న. అయితే.. రెడ్డి శాంతి మాత్రం ఏం జరిగినా.. ఎన్నికల వరకు బయటకు రాకుండా మేనేజ్ చేయాలన్న ధోరణిలోనే ఉన్నారని తెలుస్తోంది. దీంతో పార్టీ నాయకులు, కేడర్ కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
