రెడ్లు ఏకమయ్యారా? జగన్కు అండగా నిలుస్తారా?
కట్ చేస్తే.. లడ్డూ వివాదం సహా.. అనేక విషయాలు తెరమీదికి వచ్చి.. చాలా రోజులు గడిచిపోయినా.. ఇప్ప టి వరకు రెడ్డి సామాజిక వర్గంలో వైసీపీ ఆశిస్తున్నమేరకు ఐక్యత అయితే కనిపించడం లేదు.
By: Garuda Media | 11 Feb 2026 10:41 AM ISTరాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. కులాలను మరోసారి ఏకం చేస్తున్నాయని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల వైసీపీ సీనియర్ నేత.. అంబటి రాంబాబు ఇంటి పై దాడి జరిగిన సమయంలో ఆయనకు మద్దతుగా కాపులు ఉద్యమించారని వైసీపీ చెబుతోంది. కానీ, ఇది ఎంత వరకు వాస్తవమో.. తెలియాల్సి ఉంది. పైకి నలుగురు కాపులు జెండాలు పట్టుకుని రోడ్డెక్కినంత మాత్రాన వారంతా వైసీపీకి మద్దతుగా ఉన్నారని చెప్పే పరిస్థితి లేదు.
ఇక, ఇదేసమయంలో జగన్ను హిందూ వ్యతిరేకిగా మార్చేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని.. వైసీపీ సీనియర్ నేత, మాజీ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం.. దీనిని ఖండిం చేందుకు.. జగన్కు మద్దతుగా నిలిచేందుకు రెడ్డి సామాజిక వర్గం ఏకం కావాలని కూడా సజ్జల పరోక్షంగా వ్యాఖ్యానించారు. ``ఇంత జరుగుతుంటే.. రెడ్లు ఎందుకు ఊరుకుంటారు`` అని నర్మగర్భంగా సజ్జల వ్యాఖ్యలు చేశారు.
కట్ చేస్తే.. లడ్డూ వివాదం సహా.. అనేక విషయాలు తెరమీదికి వచ్చి.. చాలా రోజులు గడిచిపోయినా.. ఇప్ప టి వరకు రెడ్డి సామాజిక వర్గంలో వైసీపీ ఆశిస్తున్నమేరకు ఐక్యత అయితే కనిపించడం లేదు. ఎందుకంటే .. అధికారంలో ఉన్నప్పుడు తన వారిగా ఉన్న ఓ వర్గం రెడ్డి నాయకులకు మాత్రమే జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇతర నాయకులకు అవకాశం ఇవ్వలేదు. ఇది రెడ్డి సామాజిక వర్గంలో బలంగా వినిపిస్తున్న ప్రధాన విమర్శ. మరోసారి అధికారంలోకి వచ్చినా.. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటే.. తమ పరిస్థితి ఏంటన్నది వారి మాట.
దీనికితోడు.. జగన్కు విధేయులుగా ఉన్న రెడ్డి నాయకులు సాయిరెడ్డి , బాలినేని శ్రీనివాసరెడ్డి సహా చాలా మంది రెడ్డి నేతలు.. కూడా పార్టీకి దూరమయ్యారు. వారిని బుజ్జగించి.. తిరిగి పార్టీలోనే కొనసాగేలా జగన్ వ్యవహరించలేదు. ఈ పరిణామాలు కూడా రెడ్డి వర్గంలో తరచుగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం ఇప్పటికీ వైసీపీకి దూరంగానే ఉంది. పార్టీలో అయితే.. ఓ రెడ్డి నేతపై(ఈయన ప్రజా ప్రతినిధి కాదు) నాయకులకు తీవ్ర అసంతృప్తి కొనసాగుతోంది. అందుకే.. రెడ్లు.. జగన్కు ఇప్పటికిప్పుడు ఆశించిన మేరకు కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు.
