ఆ కీలక పదవి కోసం ఇద్దరు టాప్ లీడర్ల ‘వారసత్వ’ పోరు.. !
మరోవైపు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు జెడ్పీ పీఠంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.
By: Garuda Media | 2 Sept 2026 11:00 PM ISTవిజయనగరం జిల్లా పరిషత్ పీఠం దక్కించుకోవడం కోసం జిల్లా రాజకీయాల్లో మళ్లీ రసవత్తర సమరం మొదలైంది. ఒకవైపు వైసీపీ అక్కడ బలంగా ఉండగా, ఇప్పుడు అధికార కూటమి కూడా అంతే పటిష్ఠంగా ఉనికి చాటుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని విజయనగరం మేయర్ స్థానంతో పాటు, ప్రతిష్టాత్మకమైన జెడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి భాగస్వామ్య పక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. మేయర్ పదవి టీడీపీ తీసుకుంటే, జెడ్పీ స్థానాన్ని తమకు కేటాయించాలని జనసేన కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది.
మరోవైపు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు జెడ్పీ పీఠంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. తన రాజకీయ వారసుడు రామ్మల్లిక్ నాయుడిని ఈ పదవిలో కూర్చోబెట్టి, ఆయనను స్థానిక రాజకీయంలో బలంగా నిలబెట్టాలని కళా వెంకటరావు భావిస్తున్నారు. కూటమి అధికారంలో ఉండటంతో జెడ్పీ పదవి సునాయాసంగా దక్కుతుందని, తద్వారా తన కుమారుడికి మంచి రాజకీయ వేదిక లభిస్తుందని అంచనా వేస్తూ ఆయన తెరవెనుక పావులు కదుపుతున్నారు.
అయితే, ఈ పీఠంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా కన్నేశారు. ఆయన ఇప్పటికే తన కుమార్తె అనూషను రాజకీయ వారసురాలిగా ముందుకు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత 15 ఏళ్లుగా విజయనగరం జెడ్పీలో బొత్స కుటుంబానిదే ఆధిపత్యం కావడంతో, ఈసారి కూడా ఆ పీఠాన్ని దక్కించుకుని తన కుమార్తెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని బొత్స వర్గీయులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా అనూష రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ నాయకులకు కావాల్సిన విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కిమిడి, బొత్స వారసులు ఇద్దరూ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏదో ఒక మండలం నుంచే జడ్పీటీసీగా పోటీ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
గుర్ల, గరివిడి, మొరకముడిదాం మండలాలను వీరు టార్గెట్గా పెట్టుకుని రిజర్వేషన్ ఎక్కడ అనుకూలంగా వస్తే అక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణపై కిమిడి కళా వెంకటరావు విజయం సాధించారు. ఇప్పుడు వీరిద్దరూ తమ తమ వారసులను జెడ్పీ రేసులో నిలిపేందుకు సిద్ధమవుతుండటంతో, విజయనగరం జెడ్పీ పీఠం కోసం మరోసారి బొత్స వర్సెస్ కిమిడి మధ్య ఆసక్తికర పోరు ఖాయంగా కనిపిస్తోంది.
