బీజేపీ రాజుగారిని కాస్త పట్టించుకోవాలట... !
దీంతో పార్టీలో తనను పట్టించుకోవడం లేదంటూ.. పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ``పార్టీలో సీనియర్లు.. సీనియర్లు అంటారు కానీ.. వాళ్లకి వాల్యూ లేదండీ.
By: Garuda Media | 23 Aug 2026 5:00 PM ISTబీజేపీ సీనియర్ నాయకుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. సొంత పార్టీ పైనా ఆయనకు అదే విధానం కొనసాగు తోంది. ఇదే ఇప్పుడు ఎప్పుడూ.. ఆయనకు ఇబ్బందిగా మారింది. కానీ, ఆయన ఈవిషయం గుర్తించారో లేదో తెలియదు కానీ.. పార్టీ మాత్రం ఆయనను గుర్తించాలని కోరుకుంటున్నారు. మరి ఇంతకీ ఏం జరిగింది? అనేది కదా.. సందేహం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇటీవల విశాఖపట్నానికి వచ్చారు. రెండు రోజులు ఇక్కడే ఉన్నారు. ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం. భవిష్యత్తు వ్యూహాలు.. కూటమితో ఎలా కలివిడిగా ఉండాలి. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి.. అనే అంశాలపై ఆయన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కట్ చేస్తే.. జాతీయ అధ్యక్షుడు వచ్చినప్పుడు సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో విష్ణకుమార్ పేరు లేదు. ఇదే ఆయనకు ఆవేదన కలిగించింది.
దీంతో పార్టీలో తనను పట్టించుకోవడం లేదంటూ.. పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ``పార్టీలో సీనియర్లు.. సీనియర్లు అంటారు కానీ.. వాళ్లకి వాల్యూ లేదండీ. మా మాట ఎవరు వింటారు. మా పార్టీలో మొదట నుంచి ఇలానే ఉంది.`` అని ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. అయితే.. పార్టీ పరంగా ఆయనకు ఏమీ తక్కువ చేయలేదని పార్టీ కీలక నాయకులు చెబుతున్నారు. పూర్తిగా పార్టీ కార్యక్రమం అవడంతోపాటు యువ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని అందుకే కొందరి పేర్లను కమిటీలో చేర్చలేదని పేర్కొన్నారు.
కట్ చేస్తే.. విష్ణుకుమార్ రాజు వ్యవహారం ఆది నుంచి అసంతృప్తితోనే ముందుకు సాగుతోంది. తనకు ఆశించిన మేరకు గుర్తింపురాలేదన్నది ఆయన ఆవేదన. అంతేకాదు.. సిఫారసులకు పార్టీలో ప్రాధాన్యం ఉందని కూడా గతంలోనే వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆయన ఆశిస్తున్నది మంత్రిపదవన్న విషయం తెలిసిందే. కానీ, ఈ విషయంలో ఆయన కోరుకున్నట్టు జరగడం లేదు. అందుకే ఈ అసంతృప్తి అన్నది పార్టీ నేతలకు కూడా తెలిసిందే. మరి ఏది ఏమైనా సీనియర్ ఎమ్మెల్యేగా విష్ణు కుమార్ను పట్టించుకుంటారో.. లేక యూత్ జాబితాలో దూరం పెడతారో చూడాలి.
