విశాఖలో అర్ధరాత్రి రన్నింగ్... అగ్నిపధ్ వీరుల కోసం !
ఇందులో భాగంగా విశాఖలోని ఆర్కె బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను కూడా సిద్ధం చేశారు.
By: Satya P | 2 Sept 2026 10:04 PM ISTవిశాఖపట్నం కేంద్రంగా ఆర్మీ నియామక ర్యాలీ సెప్టెంబర్ 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభం అయింది. దీని కోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించే ఈ నియామక ర్యాలీకి మొత్తం ఏపీ వ్యాప్తంగా 10 వేల 350 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అగ్నిపధ్ పథకం కింద అభ్యర్థుల ఎంపిక కోసమే ఈ నియామక ర్యాలీ చేపడుతున్నారు. ఇందులో భాగంగా విశాఖలోని ఆర్కె బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను కూడా సిద్ధం చేశారు. అభ్యర్థుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ర్యాలీ ప్రాంగణం రన్నింగ్ సైట్ వద్ద వైద్య బృందాలు అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. అగ్నిప్రమాద నివారణకు ఫైర్ టెండర్ విద్యుత్ అంతరాయాలు లేకుండా జనరేటర్లను కూడా సిద్ధంగా ఉంచారు.
వాహనాల రాకపోకలకు ఆంక్షలు :
ఆర్మీ నియామక ర్యాలీ దృష్ట్యా సెప్టెంబర్ 2 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు విశాఖ బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఇరువైపులా ఎటువంటి వాహనాలను అనుమతించరని అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది. ఆర్మీ నియామక ర్యాలీ సజావుగా నిర్వహించేందుకు వాహనదారులు ప్రజలు సహకరించాలని కోరింది
అభ్యర్ధులు రెడీగా :
ఇదిలా ఉంటే విశాఖ జిల్లా యంత్రాంగం, ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, పోలీస్, జివిఎంసి, రెవెన్యూ, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులు సమన్వయంతో అర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ సమయానికి ర్యాలీ ప్రాంగణానికి చేరుకుని సంబంధిత అర్హత పత్రాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరమైన ఇతర డాక్యుమెంట్లతో హాజరుకావాలని అధికారులు సూచిస్తున్నారు. అర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగం కోరింది.
