Begin typing your search above and press return to search.

మంత్రి యోగం కోసం సీనియర్ ఎమ్మెల్యే తపస్సు !

మంత్రి పదవి కొందరికి సులువుగా దక్కుతుంది. మొదటి సారి గెలిచినా కూడా మంత్రి అయిపోతారు.

By:  Satya P   |   30 Aug 2026 7:00 AM IST
మంత్రి యోగం కోసం సీనియర్ ఎమ్మెల్యే తపస్సు !
X

మంత్రి పదవి కొందరికి సులువుగా దక్కుతుంది. మొదటి సారి గెలిచినా కూడా మంత్రి అయిపోతారు. మరి కొందరికి మాత్రం దాని కోసం జీవిత కాలం అంతా వేచి ఉండాల్సి వస్తుంది. అయినా సరే అమాత్య హోదా అయితే లభించదు. రాజకీయ జీవితం తూర్పు నుంచి పడమరకు జారిపోతున్నా కూడా వారికి అందలం ఎక్కే అదృష్టం మాత్రం కలిసి రాదు. ఒక విధంగా రాజకీయం అంటే ఇదే. ఇందులో కూడా ఆవ గింజ అంత అయినా లక్ కలసి రావాలి. అలాగే నక్కని తొక్కి ఉండాలి. ఇపుడు ఇలాంటి సీనియర్లలో కొంతమంది ఇక తమ రాజకీయం ముగుస్తోంది కానీ మంత్రి అనిపించుకోలేకపోయామని మధన పడుతున్నారు. వారిలో ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి ఉన్నారు. ఆయన 2024లో గెలుపుతో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు అయింది. తన జీవిత కాలం కోరిక అయిన మంత్రి పదవి మాత్రం ఆయనకు దక్కకపోవడంతో నిరాశకు గురి అవుతున్నారని అంటున్నారు.

అర్ధ శతాబ్ధం రాజకీయం :

ఇక చూస్తే కనుక ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే సుదీర్ఘమైనది. 1981 లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన 1985లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1989, 1994, 1999 మరియు 2004 సంవత్సరాల్లో వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు. రాష్ట్ర విభజన వ్యతిరేక నేపథ్యంలో కాంగ్రెస్ వీడి తిరిగి టీడీపీలో చేరారు. 2024 శాసనసభ ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. అయితే ఆయన మంత్రి పదవిని ఆశిస్తూ వస్తున్నారు. ఈసారితో రాజకీయం చాలించాలని ఆయన భావిస్తున్నారు. కానీ మంత్రి పదవి ఆయనకు ఇక దక్కదని కూడా తేలిపోయింది అని అంటున్నారు.

ప్యానెల్ స్పీకర్ గా :

ఇక నంద్యాల వరదరాజులు రెడ్డిని ప్యానెల్ స్పీకర్ గా నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనతో పాటు ఆయన వర్గీయులలో కూడా మంత్రి పదవి మీద ఆశలు పూర్తిగా అడుగంటాయని అంటున్నారు. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వరదరాజుల రెడ్డి ప్యానెల్ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో ప్యానెల్ స్పీకర్‌గా బాధ్యతలు కూడా స్వీకరించారు. 2024 శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరిలో కెల్లా ఆయనే అత్యంత వయోవృద్ధుడు కావడం విశేషం. సభలో స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సమయంలో సభా వ్యవహారాలను నడిపించడానికి సీనియర్ సభ్యుడైన వరదరాజుల రెడ్డిని ఈ బాధ్యతకు ఎంపిక చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా మంత్రిగా అవకాశం దక్కదని చెప్పడానికే ఈ పదవి అన్నది ఆయన అనుచరుల మాటగా ఉంది అని అంటున్నారు.

మంత్రి వర్గ విస్తరణలో :

ఇక మంత్రి వర్గ విస్తరణలో వరదరాజులు రెడ్డి పేరు కచ్చితంగా ఉంటుందని ఆయన అనుచర వర్గం భావిస్తూ ఉంది. ఎందుకంటే ప్రొద్దుటూరు అసెంబ్లీ సీటు వైసీపీకి కంచు కోట లాంటిది. అంతకు ముందు కాంగ్రెస్ కూడా ఇక్కడ బలంగా పునాదులు వేసుకుంది. రెండు సార్లు అంటే 2014, 2019లలో రాచమల్లు శివప్రసాదరెడ్డి వైసీపీ నుంచి ఇక్కడ గెలిచారు. ఆయన వరదరాజులు రెడ్డి శిష్యుడు కావడం విశేషం. ఆయన్ని ఓడించింది 2024 లో వరదరాజులు రెడ్డి. అంతలా తన బలం చాటుకున్నా కూడా రాజకీయంగా మరింత ఉన్నత స్థితిని ఆశిస్తున్న క్రమంలో ప్యానెల్ స్పీకర్ తో సరిపుచ్చుతున్నారా అన్నదే ఆయన వర్గీయులలో చర్చగా ఉంది. మంత్రి వర్గ విస్తరణ తొందరలో జరగనుంది అన్న ఊహాగానాల నేపధ్యంలో సీనియర్లకు ఈ విధంగా వేరే చోటు కల్పించి పక్కన పెడుతున్నారని కూడా వరద రాజులు రెడ్డి వర్గీయులలో ఉందిట. మొత్తానికి ఈ సీనియర్ ఎమ్మెల్యే మంత్రి పదవి కోరిక తీరేటట్టు అయితే ఏ మాత్రం కనిపించడం లేదనే అంటున్నారు.