ఇకపై యూపీఐ చెల్లింపుకు కెమెరా, స్కాన్ అవసరం లేదు
ఇప్పటికే కొన్ని షాప్స్, బంక్స్ లో వారే అమౌంట్ ఎంటర్ చేసి క్యూఆర్ ఇస్తారు. ఆ క్యూఆర్ ను స్కాన్ చేసి, అమౌంట్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ పిన్ ఇచ్చేస్తే పేమెంట్ అవుతుంది.
By: Ramesh Palla | 11 Sept 2026 1:01 PM ISTఇండియాలో డిజిటల్ చెల్లింపులు ఏ స్థాయిలో పెరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గడచిన ఐదేళ్లలో యూపీఐ పేమెంట్స్ రికార్డ్ స్థాయిలో పెరిగినట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నెలకు 20 బిలియన్ల చెల్లింపులు యూపీఐ ద్వారా జరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలు చెప్పడం జరిగింది. యూపీఐ చెల్లింపులతో వ్యాపారం పెరగడంతో పాటు, అనేక ఉపయోగాలు ఉన్నాయి. దేశ ఆర్థిక వృద్ధి సైతం యూపీఐ చెల్లింపుల వల్ల మెరుగుపడుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ యూపీఐ చెల్లింపు విధానంలో ప్రతి ఏడాది విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుంది. యూపీఐ చెల్లింపుల కోసం పలు కంపెనీలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇండియాలో యూపీఐ యాప్ అనగానే పోన్ పే, జీ పే, పేటీఎంలు గుర్తుకు వస్తాయి. అలాగే డబ్బులు చెల్లించాలంటే క్యూఆర్ కోడ్, స్కానర్లు గుర్తుకు వస్తాయి.
యూపీఐ చెల్లింపులో కొత్త పద్ధతి...
ఇక మీదట షాప్ల వద్ద క్యూ ఆర్ కోడ్లు, ఫోన్లో స్కాన్ చేయడం ఏమీ ఉండక పోవచ్చు. యూపీఐ చెల్లింపులు విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ఇది దేశం మొత్తం అందుబాటులోకి రావడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. రాబోయే రెండు మూడు ఏళ్లలో షాప్స్, మాల్స్, టిఫిన్ బండ్ల వద్ద కూడా క్యూఆర్ కోడ్లు ఉండక పోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ స్కాన్ విధానం కంటే మరింత సులువుగా పేమెంట్ చేయడం కోసం ట్యాప్ విధానం తీసుకు వస్తున్నారు. ఇంతకు ముందు కార్డ్ స్వైపింగ్ ఉండేది. కానీ ఇప్పుడు కార్డ్లపై సిమ్ ఉంటే, దాన్ని ట్యాప్ చేస్తే చెల్లింపులు అవుతున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ఫోన్ పే లేదా మరే యూపీఐ యాప్తో అయినా మర్చంట్ వద్ద ఉన్న మిషన్ వద్దకు తీసుకు వెళ్తే ట్యాప్ చేసినట్లు అవుతుంది. దాంతో ఫోన్లో మనం చెల్లించాల్సిన మొత్తం, ఇతర వివరాలు కనిపిస్తాయి.
క్యూఆర్ కోడ్ అవసరం లేకుండా చెల్లింపు...
ఇప్పటికే కొన్ని షాప్స్, బంక్స్ లో వారే అమౌంట్ ఎంటర్ చేసి క్యూఆర్ ఇస్తారు. ఆ క్యూఆర్ ను స్కాన్ చేసి, అమౌంట్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ పిన్ ఇచ్చేస్తే పేమెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ క్యూఆర్ స్కాన్ కూడా అవసరం లేకుండా, షాప్స్ వారు తమ వద్ద ఉండే POS మెషీన్లో అమౌంట్ను ఎంటర్ చేస్తారు. ఆ POS మెషీన్ వద్దకు మన వద్ద ఉన్న NFC ఉన్న మీ ఫోన్ను తీసుకు వెళ్లి ఏదైనా యూపీఐ యాప్ ఓపెన్ చేయగానే మనం చెల్లించాల్సిన అమౌంట్ కనిపిస్తుంది. అప్పుడు వివరాలు సరి చూసుకుని, అమౌంట్ సరైనదేనా, షాప్ వివరాలు కూడా చూసుకుని ఓకే అయితే యాక్సెప్ట్ కొట్టి పిన్ ఎంటర్ చేస్తే చెల్లింపులు పూర్తి అవుతాయి. దీంతో చాలా స్పీడ్గా పేమెంట్ అవుతుంది. కొన్ని సార్లు స్కాన్ కాకపోవడం వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతారు. వ్యాపారులు సైతం పదే పదే క్యూఆర్ కోడ్ ను మార్చాల్సి వస్తుంది. కనుక ఇకపై అలా చేయనక్కర్లేదు.
25 బిలియన్ల యూపీఐ చెల్లింపులు..
ఈ కొత్త పద్ధతి అలవాటు పడటానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. చదువుకున్న వారికి ఇది ఉత్తమమైనది, కానీ చదువు లేని వ్యాపారులకు అమౌంట్ ఎంటర్ చేయడం అనేది కాస్త కష్టం కావచ్చు. కనుక ఈ కొత్త పద్ధతి తో పాటు పాత పద్ధతిలో స్కాన్ చేసి చెల్లించే పద్ధతి కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే డిజిటల్ చెల్లింపులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతు ఉంటే, కొత్త పద్దతి లో మరింత భారీగా చెల్లింపులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు యూపీఐ చెల్లింపులు 25 బిలియన్లకు చేరినా ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపు యాప్స్ కి ఎక్కువగా అనుమతులు ఇవ్వడం ద్వారా మరింత వ్యాపారం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
