ట్రంప్ను కలిసిన పాక్ ప్రధాని షరీఫ్.. ఏంటీ కథ?
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన అతి స్వల్ప భేటీ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
By: A.N.Kumar | 25 Sept 2025 1:00 AM ISTపాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన అతి స్వల్ప భేటీ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 80వ సెషన్ సందర్భంగా న్యూయార్క్లో జరిగిన స్వాగత విందులో ఈ సమావేశం జరిగింది. కేవలం 36 సెకన్ల పాటు కొనసాగిన ఈ భేటీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
36 సెకన్ల భేటీ: వివరాలు ఏంటి?
UNGA 80వ సెషన్ సందర్భంగా అరబ్ ఇస్లామిక్ దేశాల నేతలకు ట్రంప్ , ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇచ్చిన విందులో ఈ భేటీ జరిగింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకారం.. షరీఫ్ ,ట్రంప్ మధ్య జరిగిన ఈ సంభాషణ అనధికారికమైనది.
ఈ సమావేశంలో షరీఫ్తో పాటు పాక్ ప్రతినిధి బృందానికి చెందిన ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ , ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. పాక్ - అమెరికా వంటి రెండు కీలక దేశాల అధినేతలు ఇంత తక్కువ సమయం కలుసుకోవడం..ఆ వీడియోలు వైరల్ అవ్వడం నెటిజన్లలో ఆశ్చర్యాన్ని, చర్చను రేకెత్తిస్తోంది.
*పాక్-అమెరికా సంబంధాల్లో కొత్త పరిణామాలు
గతంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న పాకిస్థాన్-అమెరికా సంబంధాలు ఇటీవల కాలంలో గణనీయంగా మెరుగుపడుతున్నాయి. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి ఇది ఉదాహరణ. జూన్లో ట్రంప్ వైట్ హౌస్లో పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తో వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధి , క్రిప్టో కరెన్సీపై చర్చలు జరిపారు. జూలైలో అమెరికా పాకిస్థాన్తో ఒక ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించింది.
* ఎనర్జీ - ఖనిజాలు:
పాక్లోని భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి అమెరికా సహాయం ప్రకటించింది. కీలక ఖనిజాల రంగంలో పాక్ ఇటీవల అమెరికా నుంచి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పొందింది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో, ట్రంప్ - షరీఫ్ల 36 సెకన్ల భేటీ వీడియో వైరల్ అవ్వడం.. దానిపై నెటిజన్ల ఆశ్చర్యం ఒక విచిత్రమైన పరిస్థితిని సూచిస్తోంది.
*భవిష్యత్తుపై అంచనాలు
ఈ స్వల్ప భేటీ తర్వాత పాకిస్థాన్ - అమెరికా మధ్య వాణిజ్యం, సాంకేతికత , భద్రతా రంగాల్లో భాగస్వామ్యం మరింత పటిష్టం అవుతుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం మెరుగుపడుతున్న ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా, ఇరు దేశాల మధ్య భవిష్యత్తు చర్చల్లో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ 36 సెకన్ల వీడియో ఇరు దేశాల దౌత్య సంబంధాలపై సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చకు దారితీసింది.
