Begin typing your search above and press return to search.

ఇక చైనా మీద పడ్డ ట్రంప్

ఇండియాపై టారిఫ్ ల యుద్ధం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా చైనాపై తన ధాటిని ప్రదర్శించారు.

By:  A.N.Kumar   |   26 Aug 2025 9:58 AM IST
ఇక చైనా మీద పడ్డ ట్రంప్
X

ఇండియాపై టారిఫ్ ల యుద్ధం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా చైనాపై తన ధాటిని ప్రదర్శించారు. అమెరికా భద్రత, ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ సరఫరా విషయంలో బీజింగ్‌ వైఖరిపై ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

- మ్యాగ్నెట్స్ ఇవ్వకపోతే 200% టారిఫ్స్

అమెరికాకు చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సరఫరా ఆపితే, వెంటనే 200% వరకు భారీ టారిఫ్స్ విధిస్తామని ట్రంప్‌ బహిరంగంగా ప్రకటించారు. "వాళ్లు మాకు మ్యాగ్నెట్స్ ఇవ్వాల్సిందే. లేని పక్షంలో భారీ టారిఫ్స్ విధించడం గానీ, మరో కఠిన నిర్ణయం గానీ తీసుకుంటాం. కానీ ఆ స్థితి రావడం లేదని భావిస్తున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.

- చైనా పర్యటనతో కలిసిన వార్నింగ్

ఆసక్తికర విషయం ఏమిటంటే.. త్వరలోనే చైనా పర్యటనకు వెళ్ళబోతున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. పర్యటనకు ముందు ఇలాంటి వార్నింగ్‌ ఇవ్వడం విశేషం. ఇది అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల్లో మరింత ఉద్రిక్తతకు దారి తీసే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ప్రాముఖ్యత

రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ ప్రధానంగా చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి ఆటోమోటివ్‌ పరిశ్రమ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, విండ్‌ టర్బైన్స్‌, డిఫెన్స్‌ సిస్టమ్స్‌, స్మార్ట్‌ ఫోన్స్‌, కంప్యూటర్లలో కీలక పాత్ర పోషిస్తాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఈ మ్యాగ్నెట్స్‌పై గణనీయంగా ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ చైనా సరఫరా నిలిపేస్తే, అమెరికా పరిశ్రమలకే కాకుండా ప్రపంచ మార్కెట్లకు పెద్ద దెబ్బ తగలవచ్చు.

- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కొనసాగుతుందా?

ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం చెలరేగింది. టారిఫ్స్‌ పెంపులు, ఆంక్షలు, ప్రతిఆంక్షలు రెండువైపులా పడ్డాయి. ఇప్పుడు మళ్లీ ట్రంప్ చైనాపై హడావుడి పెంచుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఈ రెండు శక్తివంతమైన దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎటు తేలతాయో అన్నదానిపై అంతర్జాతీయ దృష్టి పడింది.

- నిపుణుల అభిప్రాయం

ఆర్థిక నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ విషయంలో అమెరికా ప్రత్యామ్నాయ వనరులు ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. కాబట్టి చైనా సరఫరా నిలిపేస్తే అమెరికా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరోవైపు ట్రంప్‌ వార్నింగ్‌తో చైనా తాత్కాలికంగా వెనక్కి తగ్గినా, దీర్ఘకాలంలో అమెరికా స్వంత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.

చైనా ఆధిపత్యం ఉన్న రేర్ ఎర్త్ మార్కెట్లో అమెరికా ప్రభావం చూపేందుకు ట్రంప్ చేసిన తాజా హెచ్చరిక పెద్ద చర్చనీయాంశమైంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మరోసారి ముదురుతుందా? లేక రెండు దేశాలు రాజీ మార్గం వెతుకుతాయా? అన్నది రాబోయే కాలంలో తేలనుంది.