Begin typing your search above and press return to search.

బ్రిటీష్ ఇండియా గీసిన సరిహద్దు ఇదే.. ఈ ఫొటోలో అంత మీనింగ్ ఉంది..

1893లో బ్రిటిష్‌ అధికారి మార్టిమర్ డ్యూరాండ్ గీసిన రేఖ ‘డ్యూరాండ్ లైన్’ అప్పట్లో కేవలం ఒక పరిపాలనా సరిహద్దు మాత్రమే.

By:  Tupaki Political Desk   |   13 Oct 2025 4:30 PM IST
బ్రిటీష్ ఇండియా గీసిన సరిహద్దు ఇదే.. ఈ ఫొటోలో అంత మీనింగ్ ఉంది..
X

ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఒక ఫొటో మాత్రమే కాదు.. అది ఒక చరిత్ర నిశ్శబ్ద సాక్ష్యం. 1930లో తీసిన ఈ దృశ్యం బ్రిటిష్ ఇండియా, అఫ్గానిస్తాన్ మధ్య ఉన్న ఒక బార్డర్‌ చెక్‌పాయింట్‌. ఒకవైపు బ్రిటిష్ ఇండియా గస్తీ సైనికుడు, మరోవైపు అఫ్గాన్ గార్డు. మధ్యలో ఒక బారికేడ్‌, ఒక సైన్‌బోర్డ్‌ ‘LIMIT OF BRITISH INDIA’. ఈ చిన్న సరిహద్దు రాయి, రెండు నాగరికతలను విడగొట్టిన విదేశీ గీతకు ప్రతీక.

బ్రిటీష్ రేఖ, భారతీయుల గాయం

1893లో బ్రిటిష్‌ అధికారి మార్టిమర్ డ్యూరాండ్ గీసిన రేఖ ‘డ్యూరాండ్ లైన్’ అప్పట్లో కేవలం ఒక పరిపాలనా సరిహద్దు మాత్రమే. కానీ ఆ గీతే తర్వాతి తరాల చరిత్రను మార్చింది. ఈ గీత భారతదేశం నుంచి అఫ్గానిస్తాన్‌ను వేరు చేయడమే కాకుండా, పశ్తూన్ తెగల హృదయాల్లో ఒక ‘విభజన గాయం’ చేసింది. ఈ రేఖతో కేవలం భూభాగాలు విడిపోవడమే కాదు. కుటుంబాలు, సంస్కృతులు, వాణిజ్య మార్గాలు, అనుబంధాలు విడిపోయాయి. బ్రిటిష్‌ పాలకులు దాన్ని ‘సురక్షిత పరిపాలనా హద్దు’గా చూపించినా, అసలు ఉద్దేశ్యం భిన్నం భారత ఉపఖండంలో శాశ్వత విభజన.

అఫ్గాన్‌–ఇండియా అనుబంధం

బ్రిటిష్ కాలానికి ముందు అఫ్గానిస్తాన్‌, భారత్‌ మధ్య సాంస్కృతిక, వ్యాపార, మతపరమైన సంబంధాలు విస్తృతంగా ఉండేవి. గంధార నాగరికత నుంచి బౌద్ధ మార్గాల వరకు ఈ భూభాగాలు ఒకదానిని మరొకటి అల్లుకొని ఉండేవి. కాబూల్‌ నుంచి పటియాలా దాకా కాఫీ, జరీలు, గుర్రాల వ్యాపారం జరిగేది. పురాతన మహాభారత గాధల్లో కూడా గంధార రాజ్యం (ఇప్పటి అఫ్గానిస్తాన్‌ ప్రాంతం) భారత నాగరికతలో భాగంగా చెప్పబడింది.

కానీ బ్రిటిష్‌ వ్యూహం సరిహద్దును ‘భూభాగ రక్షణ’ పేరిట గీసినా, వాస్తవంగా అది హృదయాల విభజనకు కారణమైంది. ఈ రేఖ తర్వాత ఎప్పుడూ ఆ ప్రాంతం మళ్లీ శాంతి చూడలేదు. యుద్ధం, మత విభజన, శరణార్థి వలసలు, తాలిబాన్‌ ఉగ్రవాదం ఇవన్నీ ఆ రేఖ దీర్ఘకాల మరిచిపోలేని నీడలు.

విభజన ఫలితాలు

1947లో భారత విభజన జరిగిన సమయంలో.. డ్యూరాండ్ లైన్‌ ‘పాత గాయం మీద కొత్త పగుళ్లు’లా మారింది. పాకిస్థాన్‌ ఏర్పడిన తర్వాత ఈ సరిహద్దు ఒక త్రిసంధిగా మారింది. భారత్‌-అఫ్గానిస్తాన్‌-పాకిస్థాన్ మధ్య శాశ్వత ఉద్రిక్తతకు దారితీసింది. అఫ్గానిస్తాన్‌ ఇప్పటికీ ఆ లైన్‌ను అధికారికంగా గుర్తించలేదు. పాకిస్థాన్‌ సైన్యం మాత్రం ‘ప్రమాణిత సరిహద్దు’గా భావిస్తోంది. ఈ విభేదమే ఇరుదేశాల మధ్య విశ్వాస లోపానికి కారణమవుతోంది.

ఇది కేవలం భూభాగం గురించిన సమస్య కాదు.. మానవ సంబంధాల విఘాతం గురించినది. ఒకే భాష మాట్లాడే.. ఒకే సంస్కృతిలో పెరిగిన ప్రజలు ఇప్పుడు వేర్వేరు దేశాల పాస్‌పోర్ట్‌లు పట్టుకొని ఒకరినొకరు అనుమానంతో చూస్తున్నారు.

మిగిలే ఉన్న గాయాలు..

ఈ చిత్రంలోని సైనికులు లేరు. కానీ వారు కాపలా కాసిన సరిహద్దు గీత ఇంకా మనసుల్లో ఉంది. విదేశీ పాలకులు వెళ్లిపోయారు, కానీ వారి రేఖలతో వచ్చిన విభజన ఇంకా మన రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. భారత్‌, అఫ్గానిస్తాన్‌ చరిత్రలో శత్రుత్వం కంటే అనుబంధమే ఎక్కువ. ఈ ఫొటో మనకు ఒకే పాఠం చెబుతుంది ‘సరిహద్దులు గీసినవారు చరిత్ర రాశారు, కానీ వాటిని చెరిపే బాధ్యత మనదే.’ ఈ చిత్రం కేవలం గతాన్ని మాత్రమే చూపించదు.. అది భవిష్యత్తు బాధ్యతను గుర్తు చేస్తుంది.