Begin typing your search above and press return to search.

తెలంగాణా జనాభాలో భారీ మార్పులు దేనికి సంకేతం ?

ఉమ్మడి ఏపీలో జనాభా రమారమి ఎనిమిదిన్నర కోట్ల దాకా ఉన్నపుడు 2014లో రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాయి.

By:  Satya P   |   2 July 2026 9:20 AM IST
తెలంగాణా జనాభాలో భారీ మార్పులు దేనికి సంకేతం ?
X

ఉమ్మడి ఏపీలో జనాభా రమారమి ఎనిమిదిన్నర కోట్ల దాకా ఉన్నపుడు 2014లో రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాయి. అందులో ఏపీ జనాభా దాదాపుగా అయిదు కోట్లు ఉంటే తెలంగాణా జనాభా మూడున్నర కోట్లు అని అంచనాలు ఉండేవి. అయితే విభజన తరువాత పుష్కర కాలం గడిచిపోయింది. ఈ క్రమంలో ఇన్నేళ్ళ కాలంలో తెలంగాణా జనాభాలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున జనాభా పెరిగినట్లుగా తాజా అంచనాలు తెలియచేస్తున్నాయి. ఏకంగా మరో కోటి దాకా జనాభా తెలంగాణాలో కొత్తగా జత చేరుతోందని ప్రాధమిక లెక్కలు తెలియచేస్తున్నాయి. దీంతో తెలంగాణా వేగంగా ఎదుగుతూ తన వైపుగా జనాలను ఆకట్టుకుంటున్న మోస్ట్ పాపులర్ స్టేట్ గా ఎమర్జ్ అవుతోంది అని అంటున్నారు.

జనగణన తొలి దశలో :

ఇదిలా ఉంటే జనగణన కేంద్రం ఆదేశాల మేరకు దేశమంతటా జరుగుతోంది. అందులో తొలిదశలో కుటుంబాల విషయం సర్వేగా తీసుకుంటే ఒక లెక్క అయితే బయటకు వస్తోంది. తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం అయితే కోటీ పద్నాలుగు లక్షల మంది దాకా కుటుంబాలు నివసిస్తున్నాయని అంటున్నారు. అధికారికంగా దీని మీద అయితే ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అదే సమయంలో ఇప్పటికి రెండు సర్వేలు అయితే తెలంగాణాలో జరిగాయి. అందులో ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలలో చూస్తే కుటుంబాలు తెలంగాణాలో అధికం అయినట్లుగా తెలుస్తోంది. అంతే కాదు దీని ప్రకారం చూస్తే జనాభా కూడా భారీగానే పెరిగింది అని అంటున్నారు.

గోవా కంటే హైదరాబాద్ :

ఇక తెలంగాణా రాజధాని హైదరాబాద్ గోవా వంటి రాష్ట్రంలోని కుటుంబాల కంటే ఎక్కువగా కలిగి ఉందని ప్రాధమిక సమాచారం చెబుతోంది. దీనికి సంబంధించి మే నెలలో 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకూ నిర్వహించిన తొలి దశ కుటుంబ సర్వేలో అధికారులు ఇంటింటికీ వెళ్లి కుటుంబాలు, భవనాలు, ఇళ్లు, ఇతర నిర్మాణాల వివరాలను పక్కాగా నమోదు చేశారు. ఈ లెక్కలను తీసుకుంటే కనుక హైదరాబాద్ లో మొత్తం 36 లక్షల మంది దాకా కుటుంబాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది గోవా కంటే ఎక్కువ అని అంటున్నారు. ఇక జనగణన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. కుటుంబాలు ప్రస్తుతం తొలి దశలో లెక్కగా తేలుతున్నాయి. ఇక రెండవ దశలో వ్యక్తిగత గణన ఉంది. ఆ వివరాలు 2027 ఫిబ్రవరి నుంచి నమోదు చేస్తారు. ఆ వివరాలు కనుక వస్తే మాత్రం తెలంగాణా జనాభా మొత్తం కచ్చితంగా వస్తుందని అంటున్నారు. ఇక్ప్పటికే తాజాగా కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు వ్యకిగత గణన కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

జనాభా మీద ఉత్కంఠ :

కుటుంబాలే తెలంగాణాలో కోటీ 14 లక్షలకు పైగా ఉంటే జనాభా ఎంత అన్న చర్చ మొదలైంది. ఒక్కో కుటుంబంలో కనీసంగా నలుగురు వేసుకున్నా ఈజీగా నాలుగున్నర కోట్ల మంది తెలంగాణా జనాభా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం ఆరేడు నెలల క్రితం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. అందులో వచ్చిన లెక్క చూస్తే జనాభా మూడు కోట్ల 70 లక్షల దాకా ఉండొచ్చు అని లెక్క తేలింది. అయితే ఈ సర్వేలో మూడు నుంచి నాలుగు శాతం మంది జనాలు పాల్గొనలేదని అంటున్నారు. దాంతో ఈసారి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జన గణనలో మొత్తం పాల్గొంటారు కాబట్టి కచ్చితంగా ఆ లెక్క చూస్తే నాలుగున్నర కోట్ల పైచిలుకు గా తెలంగాణా జనాభా ఉండొచ్చు అని అంటున్నారు.

పదహారేళ్ళ క్రితం :

ఇక ఇప్పటికి పదహారేళ్ళ క్రితం 2010లో ఉమ్మడి ఏపీలో నిర్వహించిన జనాభా లెక్కలు చూస్తే తెలంగాణా జనాభా మూడున్నర కోట్లుగా తెలింది. అలాగే కుటుంబాలు అయితే 83 లక్షలుగా ఆనాడు పేర్కొన్నారు. గడచిన కాలంలో కుటుంబాలు కోటీ 14 లక్షలకు చేరుకున్నాయి అంటే 31 లక్షల దాకా పెరిగింది అని వివరాలు చెబుతున్నాయి. ఇక జనాభా కూడా కచ్చితంగా కోటికి పైగా పెరగవచ్చు అని అంటున్నారు. జనాభా ఎంత అన్నది వచ్చే ఏడాది ప్రధామార్ధంలో కచ్చితమైన లెక్క తేలుతుందని అంటున్నారు.