ఫామ్హౌస్ పాలిటిక్స్ షురూ.. స్టేట్వైడ్ టెన్షన్.. టెన్షన్!
తెలంగాణ రాజకీయాలు ఉద్రిక్త దిశగానే కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పోలీసులు తమపై దాడులు చేశారని బీఆర్ ఎస్ నాయకులు నిరసనకు దిగారు.
By: Garuda Media | 8 Sept 2026 11:09 PM ISTతెలంగాణ రాజకీయాలు ఉద్రిక్త దిశగానే కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పోలీసులు తమపై దాడులు చేశారని బీఆర్ ఎస్ నాయకులు నిరసనకు దిగారు. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నది ఆ నేతలు చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా మహిళా సభ్యులపై తీవ్ర అనుచితంగా ప్రవర్తించారని.. నాయకులు చెబుతున్నారు. మరోవైపు.. స్పీకర్ ప్రసాద్ కుమార్ కేంద్రంగా బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది.
మొత్తంగా అధికార ప్రధాన ప్రతిపక్షాల మధ్య రాజకీయం దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో తాజాగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పాలిటిక్స్కు తెరదీశారు. దీంతో అసెంబ్లీ నుంచి అకస్మాత్తుగా ఎమ్మెల్యేలు.. హరీష్రావు, కేటీఆర్ సహా.. మిగిలిన నాయకులు కూడా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ బాట పట్టారు. అదేసమయంలో పలు జిల్లాల నుంచి నాయకులను కూడా పిలవడంతో వారు సైతం.. పదుల సంఖ్యలో వాహనాల్లో ఫామ్హౌస్కు తరలి వచ్చారు. అయితే.. చాలా చోట్ల పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ నేతలు.. మరోవైపు ఫామ్ హౌస్ను చుట్టుముట్టారు. స్పీకర్ ప్రసాద్కుమార్పై బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ మధు చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. వందల మంది పోలీసులు మోహరించారు. ఇదిలావుంటే.. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. ఒకవైపు మహిళా నేతలపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది.
అయితే.. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ కూడా స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు.. తదనంతర పరిణామాలను కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నేతలు జిల్లాల్లో పర్యటించి.. బీఆర్ ఎస్ చేసిన వ్యాఖ్యలను ప్రచారంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇక, అసెంబ్లీ వేదికగా.. వ్యూహాలు మార్చాలని.. సమయానికి తగిన విధంగా స్పందించాలని బీఆర్ ఎస్ను గట్టిగా ఎదుర్కొనేందుకు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
