ఆ నాలుగు మనకే కావాలి: టీడీపీ గుసగుస!
వచ్చే నెలలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల విషయం.. టీడీపీలో చర్చకు దారి తీసింది. మొత్తంగా నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
By: Garuda Media | 19 May 2026 9:15 AM ISTవచ్చే నెలలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల విషయం.. టీడీపీలో చర్చకు దారి తీసింది. మొత్తంగా నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందినవి కాగా.. ఒకటి టీడీపీ ఎంపీకి సంబంధించిన స్థానం. అయితే.. ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాల్లో మిత్రపక్షాలకు రెండు కేటాయించాలన్న చర్చలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్పష్టతతోనే ఉన్నారు. అయితే.. తాజాగా పార్టీ సీనియర్ల నుంచి కొన్ని విజ్ఞాపనలు అందుతున్నాయి. వీటి ప్రకారం.. ఆ నాలుగు కూడా టీడీపీనే ఉంచుకోవాలని వారు కోరుతున్నారు.
వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఉత్తరాదికి చెందిన వ్యాపార వేత్త పరిమళ్ నత్వానీల సీట్లతోపాటు.. టీడీపీకే చెందిన సానా సతీష్ సీటు కూడా జూన్ 21తో ఖాళీ అవుతోంది. ఈ క్రమంలో ఒక సీటును బీజేపీ, మరో సీటును జనసేనకు కేటాయించి.. మిగిలిన రెండు స్థానాలను కూడా టీడీపీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయ త్నిస్తోంది. దీనిపై పూర్తిస్థాయి చర్చలు ఇంకా ప్రారంభం కానున్నా.. అంతర్గత చర్చలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. వాస్తవానికి ఖాళీ అవుతున్నది మూడు స్థానాలేనని.. ఒకటి ఇప్పటికే టీడీపీ ఖాతాలో ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ మూడు స్థానాలను కూడా టీడీపీ నాయకులకు ఇవ్వాలని కోరుతున్నారు.
రీజనేంటి?
రాజ్యసభ సీట్లపై నాయకులు అంతర్గత చర్చల్లో బలమైన గళం వినిపించడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నిక ల సమయంలో లెక్కకు మిక్కిలిగా నాయకులు తమ సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. తద్వారా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. వీరిలో కొందరు సామాజిక వర్గాల వారీగా రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న వారు కూడా ఉన్నారు. అయినా.. తమకు గుర్తింపు లేదని వాపోతున్నారు. ఇక, కొందరు ఎన్నారై నాయకులు కూడా రాజ్యసభను కోరుకుంటున్నారు. దీంతో మొత్తం స్థానాలను మనమే తీసుకుందామన్న ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు.
సాధ్యమేనా?
మిత్రపక్షాలకు సీట్లు ఇవ్వకుండా.. మొత్తం టీడీపీ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే.. గతంలో వచ్చిన సీట్లలో బీజేపీకి ఇచ్చారని.. నాయకులు చెబుతున్నారు. అయితే.. అప్పట్లో జనసేనకు ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు జనసేన మాత్రం ఒక సీటు ఖచ్చితంగా కావాలని కోరుతోంది. అయినప్పటికీ.. మరుసటి ఖాళీలను అంచనా వేస్తున్న నాయకులు.. 2028లో మరో మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయని.. వాటిని కేటాయిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని పార్టీ నాయకులు చెబుతున్నారు.
