Begin typing your search above and press return to search.

బాబు హెచ్చరికలు బేఖాతర్.. టీడీపీలో రెబల్స్‌ కలకలం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి సర్కార్ హవా నడుస్తున్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు మాత్రం హాట్ టాపిక్‌గా మారాయి.

By:  Garuda Media   |   27 July 2026 6:10 PM IST
బాబు హెచ్చరికలు బేఖాతర్.. టీడీపీలో రెబల్స్‌ కలకలం!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి సర్కార్ హవా నడుస్తున్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు మాత్రం హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ అధినాయకత్వం ఎంత స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నా, క్షేత్రస్థాయిలో కొందరు శాసనసభ్యుల ధిక్కార ధోరణి తగ్గడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినమైన చర్యలు ఉంటాయని పదే పదే స్పష్టం చేస్తున్నా, కొందరు నేతలు మాత్రం సొంత దారిలో నడుస్తూ పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు.

పార్టీ విధానాలను బహిరంగంగా విమర్శించడం, ప్రత్యర్థి పార్టీల నేతలతో వేదికలు పంచుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. సత్యవేడు మొదలుకొని విజయవాడ సెంట్రల్ వరకు పలు నియోజకవర్గాల్లో వెలుగు చూసిన పరిణామాలు పార్టీ క్రమశిక్షణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బయటపడిన ఉదంతాలు ఇవి కాగా, తెరవెనుక నియోజకవర్గాల్లో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న మరో అరడజను మందికి పైగా నేతల తీరు కూడా పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది.

ఈ ధిక్కార ధోరణులకు ప్రధాన కారణం రాబోయే ఎన్నికలపై నెలకొన్న ముందస్తు నిరాశేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరిగే సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా తదుపరి ఎన్నికల్లో తమకు టికెట్ దక్కడం కష్టమనే అంచనాకు వచ్చిన కొందరు నేతలు ఈ బాట పట్టారట. ఎలాగూ సీటు రాదనే నిర్వేదంతో పార్టీ లైన్‌తో సంబంధం లేకుండా తమ వ్యక్తిగత ప్రాబల్యాన్ని, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే పనిలో పడ్డారని టాక్ నడుస్తోంది.

అసెంబ్లీలో కూటమికి తిరుగులేని భారీ మెజార్టీ ఉండటంతో ప్రభుత్వం కూలిపోతుందనే భయం అధిష్టానానికి లేదు. అయితే, కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా, గీత దాటుతున్న నేతలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కిందిస్థాయి కేడర్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఆరంభంలోనే ఈ క్రమశిక్షణా రాహిత్యాన్ని కట్టడి చేయకపోతే, రాబోయే రోజుల్లో ఇది మరింత నష్టం చేకూర్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ రెబల్స్ దూకుడుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహాత్మక అస్త్రంతో చెక్ పెడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.